hyderabad: తుపాకీతో కాల్చుకుని ఆదిత్య హాస్పిటల్ ఎండీ ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని ఆదిత్య హాస్పిటల్ ఎండీ రవీంద్ర కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం తుపాకీతో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా, ఆయన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా-సాకేత్ రోడ్ మిథులలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఆదిత్య ఆస్పత్రి ఎండీ రవీంద్ర కుమార్ ఈ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
తన లైసెన్సుడ్ రివాల్వర్తోనే రవీంద్ర కుమార్ ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రవీంద్ర ఆత్మహత్య చేసుకుని చనిపోయారని పోలీసులు స్పష్టం చేశారు.
కాగా, రవీంద్ర కుమార్ స్వస్థలం సిదిపేట. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు పోలీసులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్ర ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బెంగళూరులో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో ఉప్పల్కు చెందిన గున్ రెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి(26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్లోని గణేష్ నగర్కు చెందిన గున్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రంజిత్ కుమార్ రెడ్డి ఇంటర్ వరకు నగరంలోనే చదువుకున్నాడు. ఇంటర్మీడియట్లో మంచి మార్కులను సాధించడంతోపాటు ఐఐటీ రూర్కీలోనూ సీటు సాధించాడు. అక్కడే కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు.
ఆ తర్వాత బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లాడు. శ్రీనివాస్ రెడ్డికి ఒకే ఒక కుమారుడు కావడంతో తల్లిదండ్రులు కూడా అతడితోపాటే బెంగళూరుకు వెళ్లి ఉంటున్నారు. కాగా, రెండ్రోజుల క్రితం బంధువుల ఇంట్లో శుభకార్యానికి రంజిత్ తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రంజిత్ కుమార్ రెడ్డి బెంగళూరులోని ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, రంజిత్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. రంజిత్ కుమార్ మరణవార్త విని అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.