వీడియో: కేసీఆర్తో ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ భేటీ: జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ: విపక్షాలకు సారథ్యం
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ఇక పూర్తి స్థాయి జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టదలచుకున్నారా?..బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు ఏకైక పెద్ద దిక్కుగా మారాలని నిర్ణయించుకున్నారా?..వామపక్షాలతో సహా జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతీయ పార్టీలనూ ఏకతాటి పైకి తీసుకుని రానున్నారా..వారికి మార్గదర్శనం చేయనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ.. కేసీఆర్ వేసే ప్రతి అడుగు ఇకపై జాతీయ రాజకీయాల వైపే ఉండబోతోంది.
థర్డ్ఫ్రంట్ ఇక క్రియాశీలకం..
బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న యూపీఏలకు ప్రత్యామ్నాయంగా దేశ రాజకీయాలకు థర్డ్ఫ్రంట్ను పరిచయం చేయాలనేది కేసీఆర్ ఎప్పటి నుంచో కంటోన్న కల. అన్నీ సవ్యంగా సాగివుంటే 2019 నాటికే ఇది సాకారం అయి ఉండేది. కేంద్రంలో బీజేపీ మరోసారి బంపర్ మెజారిటీతో అధికారాన్ని అందుకోవడంతో థర్డ్ఫ్రంట్ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ పక్కా వ్యూహంతో ఆయన థర్డ్ఫ్రంట్ ఏర్పాటు వైపు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో ఆరు నెలల్లో దీన్ని క్రియాశీలకంగా మార్చేలా కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారని అంటున్నారు.
వామపక్షాలతో భేటీ..
మొన్నటికి మొన్న ఉభయ కమ్యూనిస్టు పార్టీల పెద్ద తలకాయలు కేసీఆర్ను కలిశాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా హైదరాబాద్కు వచ్చి గులాబీ బాస్తో భేటీ అయ్యారు. ప్రకాశ్ కారత్, బృందా కారత్, డీ రాజా వంటి సీపీఐ, సీపీఎంలకు చెందిన హేమాహేమీల్లాంటి నేతలు కేసీఆర్ను కలిసిన వారిలో ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు మెరుపులు మెరిపించిన వామపక్ష నేతలందరూ కేసీఆర్ను కలుసుకున్నారు. థర్డ్ఫ్రంట్ ప్రయత్నాలు వేగం పుంజుకోవడానికి అక్కడే తొలి అడుగు పడిందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
హైదరాబాద్కు ఆర్జేడీ చీఫ్
ఈ పరిస్థితుల మధ్య తాజాగా రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సైతం హైదరాబాద్కు వచ్చారు. కేసీఆర్తో సమావేశం అయ్యారు. తేజస్వి యాదవ్ వెంట ఆర్జేడీకి చెందిన నలుగురు కీలక నేతలు ఉన్నారు. ప్రగతిభవన్కు చేరుకున్న వారికి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు. పాట్నా నుంచి ప్రత్యేక విమానంలో వారు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సహా కొందరు నాయకులు వారికి ఆహ్వానం పలికారు.
ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంపై..
ప్రాంతీయ పార్టీలను ఏక తాటిపైకి తీసుకుని రావడం అనే విషయం మీదే వారి మధ్య ప్రధానంగా చర్చలు సాగినట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జార్ఖండ్ ముక్తిమోర్చా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వంటి ప్రధాన ప్రాంతీయ రాజకీయ పక్షాలన్నింటికీ జాతీయ స్థాయిలో నాయకత్వాన్ని వహించాల్సిన అవసరం ఏర్పడిందని, భవిష్యత్లో ఆ అవసరం అనేది మరింత తీవ్రతరం కావొచ్చనీ కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేయడం ద్వారా థర్డ్ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ను జాతీయ రాజకీయాల తెర మీదికి తీసుకుని రావచ్చని కేసీఆర్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.
పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాల్లోకి..
జాతీయ రాజకీయాలపై ఇక పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని, అందులో భాగంగానే మొన్న ఉభయ వామపక్ష నేతలు, తాజాగా ఆర్జేడీ అధినేతతో సమావేశం అయ్యారని సమాచారం. ఢిల్లీ వేదికగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారని, దీనికి కావాల్సిన సహకారాన్ని అందించాలంటూ కేసీఆర్ వారిని కోరినట్లు చెబుతున్నారు. ఎన్డీఏ బలహీనపడుతోందని, అదే సమయంలో యూపీఏ.. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగట్లేదని కేసీఆర్ బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. థర్డ్ఫ్రంట్ను తెరమీదికి తీసుకుని రావడానికి ఇంతకంటే అనుకూల పరిస్థితులు ఉండబోవని నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఇదివరకు స్టాలిన్తో..
ఇదివరకు కేసీఆర్.. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో సమావేశమైన విషయం తెలిసిందే. తమిళనాడులోని శ్రీరంగం ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన నేరుగా చెన్నైకి వెళ్లారు. మరుసటి రోజు స్టాలిన్తో భేటీ అయ్యారు. ఆ సమావేశంలోనూ థర్డ్ఫ్రంట్ గురించే కేసీఆర్ ప్రస్తావించారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. స్టాలిన్తో నిర్వహించిన సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను కూడా కేసీఆర్- కమ్యూనిస్టులు, తాజాగా తేజస్వి యాదవ్తో జరిగిన భేటీలో చర్చించారని తెలుస్తోంది. థర్డ్ఫ్రంట్ ఏర్పాటుకు తేజస్వి యాదవ్ అనుకూలంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది.