బొప్పాయి రైతులపై దాడులు: ఖండించిన వ్యవసాయ మంత్రి
కొత్తపేట్ మార్కెట్లో బొప్పాయి రైతుల దాడి ఘటనపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇలాంటీ సంఘటనలు మార్కెట్లో పునరావృతం కాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పారు. మరోవైపు దాడి చేసిన దళారులపై స్థానిక పోలీసు స్టేషన్లో కేసులు పెట్టాలని ఆయన చెప్పారు.
మంగళవారం ఉదయం కొత్తపేట పండ్ల మార్కెట్లో బొప్పాయి రైతులు మరియు దళారుల మధ్య ధరల విషయంలో ఘర్షణ నెలకొంది. బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రత్యేక కౌంటర్ల ద్వార అమ్ముకునే ప్రయత్నం చేశారు. అయితే రైతులు నేరుగా మార్కెట్లో అమ్ముకునే వీలులేదని దళారులు వారిపై దాడి చేశారు. ఈనేపథ్యంలోనే పోలీసులు మార్కెట్కు చేరుకుని ఇరువర్గాల మధ్య సమస్యను సద్దుమణిగేలా చేశారు.
ముఖ్యంగా డెంగ్యూ బారిన పడిన వారు బొప్పాయి తినాలని డాక్టర్లు సూచించడంతో బహిరంగ మార్కెట్లో దానికి గిరాకి పెరుగుతోంది. ప్లెట్లెట్స్ సంఖ్య తక్షణమే పెరిగేందుకు బోప్పాయి దోహదం చేస్తుండడంతో దానికోసం జనాలు పరుగులు తీస్తున్నారు. ఇరుగు పొరుగు ఇంట్లో బొప్పాయి పండ్లతో పాటు చెట్టు ఆకులను సైతం తీసుకెళ్లి తింటున్నారు.
దీంతో బొప్పాయి మార్కెట్లో దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ధరలు విపరీతంగా పెరిగాయి. రిటైలర్ల వద్ద కిలో వంద రుపాయలు లభిస్తుండడంతో అందుకు అనుగుణంగా మార్కెట్లో ధరలు రైతులకు లభించడం లేదు. దీంతో రైతులు ప్రత్యేక కౌంటర్ల ద్వార అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేయడంతో ఘర్షణకు దారి తీసినట్టు తెలుస్తోంది.