Akhanda 2: అఖండ-2 ఎఫెక్ట్..! టికెట్ రేట్లపై తేల్చేసిన కోమటిరెడ్డి....!
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2కు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ పోటీ పడి టికెట్ రేట్ల పెంపుకు అంగీకరించాయి. తెలంగాణలో గతంలో పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచేది లేదని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. తాజాగా అఖండ 2 విషయంలో మాత్రం యూటర్న్ తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడం, దీనిపై ఈ నెల 14 వరకూ స్టే ఇవ్వడం జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఇవాళ సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్లో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదని ఆయన ప్రకటించారు. టికెట్ రేట్ల పెంపు కోసం వినతులతో నిర్మాతలు, దర్శకులెవరూ తమ దగ్గరకు రావొద్దని సూచించారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వమని, పేదల కోసమే నిర్ణయాలు ఉంటాయని ఆయన క్లారిటీ ఇచ్చారు.

హీరోలకు వందలకోట్ల రెమ్యునరేషన్లు ఎవరు ఇమ్మన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. కుటుంబాలతో సినిమాకు వెళ్లాలంటే తక్కువ ధరలుండాలన్నారు. వాస్తవానికి టికెట్ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామని ఆయన గుర్తుచేశారు. అయితే ఈసారి పొరపాటు జరిగిందంటూ అఖండ 2 టికెట్ రేట్ల పెంపు అంశాన్ని మంత్రి కోమటిరెడ్డి గుర్తుచేశారు. దీనిపై ప్రస్తుతం వివాదం ఏర్పడి హైకోర్టు వరకూ చేరిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో టికెట్ రేట్ల పెంచకూడదని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇండస్ట్రీ పెద్దలు వచ్చి కలిసినా సర్కార్ మాత్రం వెనక్కి తగ్గలేదు. కానీ ఈసారి బాలకృష్ణ సినిమా అఖండ 2కు మాత్రం ఏపీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో రేవంత్ రెడ్డి సై అనేశారు. కానీ తెలంగాణలో ఉన్న పాలసీకి వ్యతిరేేకంగా ఉండటంతో ఈ నిర్ణయాన్ని హైకోర్టు నిలిపేసింది. ఓవైపు అఖండ 2 సినిమా చివరినిమిషంలో విడుదల కాకుండా వాయిదా పడటంతో గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని సవరించి మరీ ఇచ్చారు. అయినా హైకోర్టు నిర్ణయంతో అఖండ నిర్మాతలతో పాటు ప్రభుత్వానికి కూడా ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతో ప్రభుత్వం ఈసారి టికెట్ రేట్లు పెంచరాదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications