చరిత్రలో ముందస్తుకెళ్లిన పార్టీలన్నీ మునిగిన నావలే..! అందుకే వెనక్కి తగ్గిన కేసీఆర్..!!
దేశ రాజకీయాల్లో జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికల అంశం పై పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ అదికారాన్ని నిలబెట్టుకోవాలని కొన్న ప్రాంతీయ పార్టీలు ప్రణాళికలు రచిస్తుంటే దేశమంతటా ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికల గేమ్ ప్లాన్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్ కు కనీసం నాలుగు నెలల ముందుగానే ఎలక్షన్ వచ్చేలా కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు ఆయన కదలికల ద్వారా అర్థమౌతోంది. డిసెంబర్ లో ఎన్నికలు జరిగేలా త్వరలోనే అసెంబ్లీని రద్దు చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది.అయితే ముందస్తుపైన ఆయన మళ్ళీ మనసు మార్చుకున్నారనే ప్రచారం కూడా ఉంది.

ముందస్తు తో అదికారాన్ని కాపాడుకోవాలనుకున్న గులాబీ బాస్..! అంతలోనే వెనకడుగు..!
నిజానికి ముందస్తు ఎన్నికలు అవసరం లేకున్నా రాజకీయ వ్యూహాల్లో భాగంగా చంద్రశేఖర్ రావు ఈ ఆలోచనకు వచ్చినట్లు అర్థమౌతోంది. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా దెబ్బతీయడం కోసమే ఆయన ఈ వ్యూహాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఒక వేళ ముందస్తు వస్తే కేసీఆర్ పార్టీ మళ్ళీ గెలుస్తుందా లేదా అన్నది పక్కన పడితే చరిత్ర మాత్రం ఆయనకు చేదు నిజాలనే చెపుతోంది.ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనవసరంగా ముందస్తుకు వెళ్లిన ఏ అధికార పార్టీ గెలిచిన సందర్భం లేదు.ప్రజలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పార్టీలు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
Recommended Video


ముందస్తు రాగం ఎవరు అందుకున్నా.. బంగపాటు తప్పలేదు..!!
ఆంధ్రప్రదేశ్ లో మొదటి సారి ఎన్టీఆర్ పార్టీ కారణంగా ముందస్తు ఎన్నికలు వచ్చాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తొందరపడింది. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి టీడీపీని దెబ్బతీయడానికి ముందస్తు వ్యూహానికి తెరలేపారు.1983 ఆగస్టులో జరగాల్సిన ఎన్నికలను జనవరిలోనే నిర్వహించేలా చేశారు. అయినప్పటికి ఎన్టీఆర్ ప్రభంజనాన్ని కాంగ్రెస్ ఆపలేక ఘోరపరాజయం పాలైంది. ఆ విధంగా మొదటి ముందస్తు ఎన్నికలు అధికార పార్టీకి చేదు అనుభవాన్ని తెచ్చిపెట్టాయి. ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో 1984 డిసెంబర్ లో ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు. దీంతో 1985 లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్ నేత్రుత్వంలోని తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.

ఎంటీఆర్, చంద్రబాబుకు సైతం చేదు అనుభవం మిగిల్చిన ముందస్తు విధానం..!
అయితే 1990లో మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన రామారావుకు చేదు అనుభవం ఎదురైంది. షెడ్యూల్ కంటే నాలుగు నెలలు ముందుగా ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్ కు మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. 1999 లో షెడ్యూల్ కంటే రెండు నెలల ముందు ఎన్నికలు నిర్వహించగా టీడీపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే 2004లో మాత్రం చంద్రబాబునాయుడి ముందస్తు ఎన్నికల వ్యూహాం బెడిసికొట్టింది. 2003లో బాబుపైన తిరుపతిలో మావోయిస్టులు దాడి చేశారు. దీంతో తనపైన సానుభూతి వస్తుందన్న అంచనాతో నవంబర్ లోనే అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఆరునెలల తర్వాత ఎన్నికలు జరిపించింది. దీంతో బాబు అంచనాలు తారుమారై వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.

2004లో పనిచేయని వాజ్ పేయి ఇండియా షైనింగ్ నినాదం..!ఓటమి మిగిల్చిన ముందస్తు..!
ముందస్తు ఎన్నికల వ్యూహాంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది. అయితే కేంద్రంలో మాత్రం ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలే వచ్చాయి. కాని బీజేపీకి చేదు అనుభవం ఉంది. 2004లో వాజ్ పేయి నేత్రత్వంలోని భారతీయ జనత పార్టీ ముందస్తుకు వెళ్లి బోల్తా పడింది. ఇండియా షైనింగ్ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీని కాంగ్రెస్ దెబ్బకొట్టింది. నిజానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన నాయకులంతా రాజకీయంగా ఊద్దండపిండాలే. కాని ప్రజల ఆలోచనలను అంచనా వేయడంలో వీరు దారుణంగా దెబ్బతిన్నారు. ప్రజల మూడ్ కాకుండా తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలు తెచ్చి చేదు అనుభవాలను కొని తెచ్చుకున్నట్లుగా చరిత్ర స్పష్టం చేస్తోంది. మరి తెెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చరిత్ర అనుభవాల నుంచి నేర్చుకుంటారో లేక సరికొత్త చరిత్రను స్రుష్టిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications