బీఆర్ఎస్ ఆవిర్బావ సభ -ప్రతిపక్షాల ఐక్య వేదికగా : సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..!?
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభకు ఖమ్మంసిద్దమైంది. బీఆర్ఎస్ తో కలిసి రాజకీయ ప్రయాణానికి సిద్దమైన పార్టీల నేతలు తరలి వస్తున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటుగా మాజీ సీఎంలు హాజరవుతున్నారు. బీఆర్ఎస్ అజెండాతో పాటుగా తమ అజెండాను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. సభను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. దాదాపు వంద ఎకరాల స్థలంలో అయిదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తోంది. ముందుగా సీఎం కేసీఆర్ ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి యాదగిరి గుట్ట వెళ్తారు. అక్కడ నుంచి ఖమ్మం సభకు చేరుకుంటారు. ఈ సభ ద్వారా తెలంగాణ..జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తిని పెంచుతోంది.

నలుగురు సీఎంలు.. ప్రముఖులు హాజరు
ఖమ్మం సభను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సభకు నలుగురు ముఖ్యమంత్రులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు సహా దాదాపు వెయ్యిమంది వీవీఐపీలు సభకు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ హాజరు కానున్నారు. అలాగే, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా తదితరులు రానున్నారు. సభకు 20 వేల మంది వీఐపీలు, వెయ్యి మంది వీవీఐపీలు, బీఆర్ఎ్సకు మద్దతు ఇస్తున్న ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖులు తరలి వస్తున్నారు. సభ వేదికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 140 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో 200 మంది అతిథులు కూర్చునేలా వేదిక ఏర్పాటు చేశారు. ఖమ్మంతో పాటు రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. నగరానికి నాలుగు వైపులా ప్రధాన రహదారుల్లో స్వాగత ద్వారాలు, గుండ్రని హోర్డింగులు, స్వాగత బ్యానర్లు, బీఆర్ఎస్ జెండాలు, తోరణాలు, నేతల కటౌట్లు ఏర్పాటు చేశారు.

జాతీయ పార్టీలను ఏకం చేసే వేదికగా..
జాతీయ స్థాయిలో బీజేపీ - కాంగ్రెసేతర పక్షాలను ఏకం చేసే ప్రక్రియలో ఖమ్మం సభ తొలి వేదిక కానుంది. ఈ సభలో బీఆర్ఎస్ తో కలిసొచ్చే పార్టీలు వేదిక పంచుకుంటున్నాయి. ఆప్, వామపక్ష పార్టీల సీఎంలు హాజరుతో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల నేతలు హాజరు అవుతున్నారు. పార్టీల ఐక్యత..జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం..బీఆర్ఎస్ లక్ష్యాలను సీఎం కేసీఆర్ ఖమ్మం సభ ద్వారా వెల్లడించనున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ -అభివృద్ధి కార్యక్రమాలను వివరించనున్నారు. దేశంలో నెలకొన్న పాలనా వైఫల్యాను ఖమ్మం సభ ద్వారా కేసీఆర్ ప్రస్తావించేందుకు సిద్దమయ్యారు. ఈ ఏడాది తొమ్మది రాష్ట్రాల్లో ఎన్నికలు..2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర పైన కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో, రాష్ట్రంలోని రాజకీయాలను కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది.

యాదాద్రి కి నలుగురు సీఎంలు..
ఖమ్మం సభలో పాల్గొనేందుకు వచ్చిన ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహుడిని దర్శించునున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభకు వెళ్లడానికి ముందు సీఎం కేసీఆర్, ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ యాదగిరీశుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి రెండు హెలికాప్టర్లలో ముఖ్యమంత్రులు, పలువురు నేతలు బయలుదేరి 11.30 గంటలకు యాదగిరిగుట్ట చేరుకోనున్నారు. స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు హెలికాప్టర్లలో ఖమ్మం బయలుదేరతారు. ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమంలోనూ నలుగురు సీఎంలు పాల్గొంటారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభినందించారు. ఈ సభలోనే తమిళనాడు కు చెందిన వీసీకే పార్టీ బీఆర్ఎస్ లో అధికారికంగా విలీనం కానుంది. ఈ సభ ద్వారా కేసీఆర్ ఎటువంటి రాజకీయ ప్రకటన చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications