అందుకే ఈ ‘హైడ్రా’మా: రేవంత్ సర్కారుపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రామా చేస్తున్నారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైడ్రా కేసు పెట్టినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. నిత్యం ఏదో ఒక సంచలనం చేయడమే రేవంత్ రెడ్డి పని అని విమర్శించారు.
కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలను కూల్చివేస్తే మంచిదని, వాటిని కూల్చివేయగలరా? అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ సోదరుడితోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ నిర్మాణాల ఆరోపణలున్నాయని చెప్పారు. సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చివేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.

రుణమాఫీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే హైడ్రాతో హైప్ చేస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కబ్జా అయిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా హైడ్రా పేరుతో రేవంత్ సర్కారు కొత్త డ్రామా చేస్తుందని విమర్శించిందని విషయం తెలిసిందే. కూల్చివేతల్లో ఎవరికీ మినహాయింపు ఉండకూడదన్నారు. అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలన్నారు. అయితే, రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవద్దని హితవు పలికారు.
కూల్చివేతలపై హైడ్రా నివేదిక
చెరువుల బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా ప్రభుత్వానికి తాజాగా నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు ఏకంగా 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు నివేదికలో పేర్కొంది. కూల్చివేత ద్వారా 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది.
ఇందులో ఎన్ కన్వెన్షన్తో పాటు కావేరి సీడ్స్ యజమాని భాస్కరరావుకు చెందిన నిర్మాణం, అలాగే ప్రొ కబడ్డీ యజమాని అనుపమకు చెందిన భవనం, మంథని బీజేపీ నేత సునీల్ రెడ్డికి చెందిన నిర్మాణం, బహదూర్పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ నిర్మాణం, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా భవనం, నందగిరి హిల్స్లో ఎమ్మెల్యే దానం మద్దతుదారుడి నిర్మాణం, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు షెడ్డు కూల్చినట్లు నివేదిక సమర్పించింది.
కాగా, శనివారం ఉదయం సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చిన విషయం తెలిసిందే. తుమ్మిడికుంట చెరువులో అనధికారిక నిర్మాణం చేయడం వల్లే సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. ఎన్ కన్వెన్షన్కు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి భవన నిర్మాణ అనుమతులు లేవని, ఏ న్యాయస్థానం కూడా స్టేలు ఇవ్వలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం వ్యవస్థలను తప్పుదారి పట్టించి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎఫ్టీఎల్ పరిధిలో 1 ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించి అనధికారిక నిర్మాణాలు చేపట్టారని, వాటికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి భవన నిర్మాణ అనుమతులు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రయత్నించగా, అధికారులు తిరస్కరించారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications