జనసేనతో పాటు ఆ పార్టీలకు ఈసీ షాక్.. లెక్క తేలాల్సిందేనంటూ నోటీసులు జారీ
రాజకీయ పార్టీలకు ఈసీ షాక్ ఇచ్చింది. ఏకంగా 119 పార్టీలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కేంద్ర న్యాయ శాఖను కోరిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం నుండి సమాధానం రాకముందే ఎన్నికల కమిషన్ ఆయా పార్టీలకు షాక్ ఇచ్చింది.

పవన్ కళ్యాణ్ జనసేనతో సహా పలు పార్టీలకు ఈసీ నోటీసులు
ఎన్నికల కమిషన్ షాకిచ్చిన రాజకీయ పార్టీలలో పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీ కూడా ఉండటం గమనార్హం. రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలపై ఈ నెలాఖరు వరకు సమాధానం చెప్పాలని ఈసీ ఆయా పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఒకవేళ సమాధానం చెప్పలేని పక్షంలో వారి పార్టీల రిజిస్ట్రేషన్ ను రద్దు చేస్తామని ఎన్నికల కమిషన్ నోటీసులలో పేర్కొంది.

జనసేనతో పాటు నోటీసులు అందుకున్న పార్టీల వివరాలివే
ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసిన పార్టీలలో జనసేన, తెలంగాణ జన సమితి, లోక్ సత్తా, తెలంగాణ ఇంటి పార్టీ, నవ తెలంగాణ, ప్రజాశాంతి పార్టీ, ప్రజా రాజ్యం పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, సమాజ్వాది ఫార్వర్డ్ బ్లాక్, జై స్వరాజ్, మన తెలంగాణ పార్టీ, జన రాజ్యం పార్టీలు ఉన్నాయి. ఈ నెలాఖరులోగా ఈ పార్టీలన్నీ సంబంధిత వివరాలను అందించాలని ఆయా పార్టీలకు నోటీసులు పంపించింది ఎన్నికల కమిషన్.

దేశంలో 2796 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నట్లు గుర్తించిన ఈసీ
ఏదో ఒక చిరునామా తో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినట్టు ప్రకటించి, ఎన్నికల్లో గుర్తుపై పోటీ చేసి, ఆ తరువాత ఉనికి లో కూడా లేకుండా పోయిన పలు రాజకీయ పార్టీలను గుర్తించిన ఎన్నికల కమీషన్ ఆయా రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇదే సమయంలో 2796 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నట్లు స్పష్టం చేసిన ఈసీ ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన అన్ని సమగ్ర వివరాలను సేకరించే పనిలో పడింది.

తెలంగాణాలో 119 రాజకీయ పార్టీల ఆదాయ వ్యయాల లెక్కలు అడిగిన ఈసీ
ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోనూ 119 రాజకీయ పార్టీలకు ఆదాయ వ్యయ వివరాలను సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. అంతేకాదు రిజిస్టర్ అయిన గుర్తింపు పొందని పొలిటికల్ పార్టీలు అందుకున్న వివరాలకు సంబంధించి కూడా ఈసీ సమగ్ర దర్యాప్తు చేస్తుంది. విరాళాల వివరాలు సమర్పించకుండా ఆదాయ పన్ను మినహాయింపు పొందిన 66 గుర్తింపు పొందిన పార్టీల సమాచారాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికే సేకరించింది.

ఆదాయపుపన్ను మినహాయింపు కోసం రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్.. అందుకే ఈసీ చర్యలు
ఆదాయపు పన్ను మినహాయింపు కోసమే చాలా పార్టీలు రాజకీయ పార్టీలుగా రిజిస్టరు చేసుకుంటున్నట్టు ఎన్నికల కమీషన్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే ఆయా పార్టీలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. లెక్కలు పక్కాగా లేకుంటే పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ప్రకటించింది.












Click it and Unblock the Notifications