టెక్కీలకు షాక్:తగ్గిన క్యాంపస్ రిక్రూట్మెంట్స్, కారణమిదే
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఐఐటీ కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లలో జోరు ప్రారంభమైంది.కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం క్యాంపస్ రిక్రూట్మెంట్లలో
ఆ జోరు కన్పించడం లేదు.తెలుగు రాష్ట్రాల్లో క్యాంపస్ రిక్రూట్ మెంట్లలో వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాయి.
ప్రపంచ వ్యాప్తంగా సాప్ట్వేర్ రంగంలో చోటు చేసుకొన్న మార్పులు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. అయితే సాఫ్ట్ వేర్ రంగంపై ప్రధానంగా అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తున్నాయి.
అయితే అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు ప్రధానంగా ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవల కాలంలో దేశంలోని ఐఐటీ కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లలో జోరు ప్రారంభమైంది. ఇదే జోరు కొనసాగుతోందని భావిస్తున్నారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఉన్న జోరు మాత్రం కానరావడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన క్యాంపస్ నియామకాలు
తెలుగు రాష్ట్రాల్లో క్యాంపస్ నియామకాలు తగ్గాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.చదువు పూర్తికాగానే ఉద్యోగం, మంచి వేతనం వస్తుందన్న ఆశలు కళ్ల ముందే కుప్పకూలుతున్నాయి.ప్రతి ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఆశించిన స్థాయిలో లేవని నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఐటీ కంపెనీలు ఏటా రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్తోపాటు ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం, తిరుపతిలలో ఉన్న సుమారు వంద కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు జరుపుతుంటాయి. కానీ ఈ ఏడాది కేవలం 25 కాలేజీల్లోనే క్యాంపస్ నియామకాలు చేపట్టాయి

క్యాంపస్ నియామకాలను తగ్గించిన కంపెనీలు
గతేడాది దాకా క్యాంపస్ నియామకాల్లో పెద్ద సంఖ్యలోనే విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, ఒరాకిల్, డెలాయిట్, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు ఈ ఏడాది ఒక్కో కాలేజీలో ఐదారుగురికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాయి. ప్రముఖ అమెరికన్ కంపెనీ కాగ్నిజెంట్ అయితే ఈ ఏడాది దేశంలో ఒక్క విద్యార్థికి కూడా ఉద్యోగం ఇవ్వకపోవడం గమనార్హం. మరో అమెరికన్ కంపెనీ యాక్సెంచర్ గతేడాదితో పోలిస్తే ఈసారి 50 శాతం మేర నియామకాలు తగ్గించుకుంది. దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్లు అదే దారిలో పయనిస్తున్నాయి. విప్రో, క్యాప్జెమినీ కంపెనీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వెయ్యి మందికి మాత్రమే ఉద్యోగావకాశాలు ఇచ్చాయి.

సింగిల్ డిజిట్కే పరిమితమైన నియామకాలు
ఇన్ఫోసిస్ కేవలం 15 కాలేజీలకే పరిమితంకాగా.. టీసీఎస్ 22 కాలేజీలు, విప్రో, క్యాప్జెమినీ కంపెనీలు హైదరాబాద్లోని పది కాలేజీలతో సరిపెట్టాయి. ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, జేఎన్టీయూ, సీబీఐటీ, వాసవి తదితర ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా నియామకాలు చేపట్టే మైక్రోసాఫ్ట్ కంపెనీ.. ఈ ఏడాది వాటి జోలికే పోలేదు. కేవలం హైదరాబాద్ ఐఐటీ, వరంగల్ నిట్లకు చెందిన పది మంది విద్యార్థులకు మత్రమే ఉద్యోగాలు ఇచ్చింది. సీబీఐటీ, వాసవి కాలేజీల్లో అత్యంత ప్రతిభావంతులైన నలుగురైదుగురు విద్యార్థులను, అది కూడా ఇంటర్న్షిప్ కింద ఎంపిక చేసుకుంది. ఏటా 50 నుంచి వంద మంది విద్యార్థులను ఎంపిక చేసుకునే డెలాయిట్ సంస్థ కూడా ఈసారి సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఇక దేశీయ కంపెనీలు గతేడాదితో పోలిస్తే 60 శాతం మేర నియామకాలు తగ్గించుకున్నాయి.

50 శాతం తగ్గిన నియామకాలు
ఏటా 50 నుంచి వంద మంది విద్యార్థులను ఎంపిక చేసుకునే డెలాయిట్ సంస్థ కూడా ఈసారి సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఇక దేశీయ కంపెనీలు గతేడాదితో పోలిస్తే 60 శాతం మేర నియామకాలు తగ్గించుకున్నాయి.ఎంసెట్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో దాదాపు 50 శాతం మంది.. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుల్లోనే చేరారు. కానీ ఐటీ కంపెనీలు పరిమిత సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటుడటంతో వారు ఆందోళనలో మునిగిపోయారు.

ఉన్న ఉద్యోగులకే ఎసరు
వి విధ ఐటీ సంస్థలు ఈ ఏడాది దాదాపు 56 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. వచ్చే ఆర్నెల్లలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు సర్వేల్లో తేలింది. అటు సీనియర్ ఉద్యోగుల తొలగింపుతోపాటు కొత్త ఉద్యోగాల కల్పన ప్రక్రియలో క్షీణత నమోదవుతున్నట్లు తేలింది.

ఆటోమేషన్ ప్రభావం
ఐటీ కంపెనీలు ఆటోమేషన్కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఉద్యోగులను సైతం ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నాయి. దానికితోడు కోడింగ్ బాగా వచ్చిన వారికే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు కేవలం కంప్యూటర్ సైన్స్, ఐటీ విద్యార్థులను మాత్రమే క్యాంపస్ నియామక పరీక్షలకు అనుమతిస్తున్నాయి. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ విద్యార్థులు కోడింగ్పై దృష్టి సారిస్తేనే మంచి ఉద్యోగాలు పొందగలుగుతారు.












Click it and Unblock the Notifications