అవిశ్వాసంతో మోడీకి దెబ్బ ఎలా?: పవన్ 'మార్చి 5' వెనుక అసలు కారణం, అలా చేసి ఉంటే..
అమరావతి: తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి కేంద్రాన్ని చిక్కుల్లో పడేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. తొలుత వైసీపీ తీర్మానానికి టీడీపీ మద్దతిస్తానని చెప్పింది.
చదవండి: చాలామందిని సీనియర్లను కలిశా, అదీ మాట్లాడుతా: పీఆర్పీపై పవన్ కళ్యాణ్
ఆ తర్వాత టీడీపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి మద్దతిస్తామని వైసీపీ ప్రకటించింది. కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఎస్పీ తదితర పార్టీలు మద్దతిచ్చే అవకాశముంది.
చదవండి: ఎవరితో మాట్లాడలేదు, అందరినీ కూడగట్టను: బాబు ఊహించని ట్విస్ట్, పవన్కు హెచ్చరిక
అవిశ్వాసం పెడితే ఏమవుతుంది?
టీడీపీ లేదా వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ ఒకే చెబతే దానిపై చర్చ జరుగుతుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టం జాతీయస్థాయిలో మరింత చర్చనీయాంశమవుతుంది. ఆయా పార్టీలు ఇతర అంశాలతో కూడా కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తాయి. అయితే అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశాలే ఉన్నాయి.
కేంద్రానికి నష్టం లేదు.. కానీ మోడీ ప్రతిష్టకు దెబ్బ
ఎంపీల బలాబలాలు పరిశీలిస్తే అవిశ్వాస తీర్మానంతో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. అయితే 200 మంది ఎంపీల మద్దతు అవిశ్వాసానికి మద్దతిస్తే అది మోడీ, బీజేపీ ప్రతిష్టకు దెబ్బ. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, లెఫ్ట్ తదితర విపక్షాలన్ని కలిసి 175 సీట్ల వరకు ఉన్నాయి. ఇతరుల మద్దతుతో 200 కూడగడితే మోడీకి నైతికంగా దెబ్బ.
ఇదీ ఎన్డీయే బలం
లోకసభలో పార్టీల బలాబలాల విషయానికి వస్తే బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి ఆ సంఖ్య 300కు చేరుకుంటుంది. టీడీపీ కాకుండానే 300 మార్క్ ఉంది. బీజేపీకి 274, ఎల్జేపీ, ఇతరులు కలిసి 17 మంది మద్దతు ఉంది. జేడీయు, అన్నాడీఎంకే పార్టీలు కలుపుకుంటే బలం 330కి పైగా ఉంటుంది. శివసేన 18, అకాలీదల్ 4గురి మద్దతు ఉంది. అయితే శివసేన, అకాలీదళ్లు ఏం చేస్తాయనేది ఆసక్తికరం.
అవిశ్వాసానికి మద్దతిచ్చే వారిలో
అవిశ్వాసానికి మద్దతిచ్చే వారిలో కాంగ్రెస్ 48, తృణమూల్ 34, బీజేడీ 20, టీడీపీ 16, లెప్ట్ 10, వైయస్సార్ కాంగ్రెస్ 9, ఇతరులు ఇరవై మందికి పైగా ఉంటారు. ఈ సంఖ్య 170కి అటు ఇటు ఉంటుంది. కానీ 200 మందికి పైగా మద్దతు కూడగట్టినా ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. కానీ బీజేపీ ప్రతిష్టకు మాత్రం దెబ్బ.
పవన్ మార్చి 5న పెట్టమనడానికి పెద్ద కారణమే
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ మార్చి 5నే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టమని చెప్పారు. ఆ తర్వాత పెట్టినా పెద్దగా ఫలితం ఉండదని అభిప్రాయపడ్డారు. దీనికి చాలా పెద్ద కారణమే ఉందని అంటున్నారు. రెండో దఫా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజే తీర్మానం పెడితే.. బిల్లులు ఆమోదం పొందడానికి ఇబ్బందులు ఎదురవుతాయని, అప్పుడు కచ్చితంగా ప్రత్యేక హోదా చర్చనీయాంశంగా మారుతుందనేది జనసేన వాదన. 5న అవిశ్వాసం పెడితే.. అది అలా ఉంటే బిల్లుల ఆమోదం పొందే అవకాశముండదని, అప్పుడు హోదాపై చర్చ జరుగుతుందని, ఇప్పుడు బిల్లులు అన్నింటిని ఆమోదింప చేసుకున్నారని, ఇప్పుడు ఫలితం ఏమిటని అంటున్నారు.
అందుకే డ్రామాలు అని
అవిశ్వాసం ముందే పెట్టి ఉంటే కీలక బిల్లుల ఆమోదం కోసమైనా దానిని పరిగణలోకి తీసుకునే వారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదనేది జనసేన వాదనగా ఉంది. అందుకే టీడీపీ, వైసీపీలు అవిశ్వాసంపై డ్రామాలు ఆడుతున్నాయని అంటున్నామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ.. కాంగ్రెస్ ముక్త భారత్ అంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని నైతికంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కూడా తప్పని పరిస్థితుల్లో టీడీపీ లేదా వైసీపీ అవిశ్వాసానికి మద్దతివ్వాల్సిందే అంటున్నారు. మొత్తానికి ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే 2019లో బీజేపీయేతర, కాంగ్రెసేతర రాజకీయ శక్తులు తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.