తెలంగాణ సచివాలయంలో మరో కరోనా పాజిటివ్: అవసరమైతేనే ఉద్యోగుల హాజరు
హైదరాబాద్: నగరంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి బారిన పడుతున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా, తెలంగాణ సచివాలయం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్లో మరోసారి కరోనా కలకలం రేపింది.
ఇప్పటికే కొందరు ఉద్యోగులు కరోనా బారిన పడగా.. సంబంధిత శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి. మిగతా శాఖల్లోనూ తక్కువ మంది ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. ఇటీవలే ఆర్థిక శాఖలో ఔట్ సోర్సింగ్లో చేస్తున్న ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ శాఖలోని ఉద్యోగులెవరూ కార్యాలయానికి రావడం లేదు.
మిగితా ఉద్యోగులు సైతం అత్యవసరమైతేనే కార్యాలయానికి వస్తున్నారు. తాజాగా ఐటీ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బీఆర్కే భవన్ ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్కానర్ కెమెరాలతో పరీక్షించాకే సిబ్బందిని లోపలికి అనుమతిస్తున్నారు.
ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి, ఆయన భార్య సహా నలుగురు సిబ్బందికి కూడా కరోనా వచ్చింది. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్ కు కూడా కరోనా సోకింది. దీంతో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు కరోనాతో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
Recommended Video
కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 4737 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2203 యాక్టివ్ కేసులున్నాయి. 2352 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి 182 మంది ప్రాణాలు కోల్పోయారు.