తల్లిదండ్రులూ జాగ్రత్త: డ్రగ్ మాఫియాపై సబర్వాల్, కడియం ఆందోళన, మరొకరి అరెస్ట్
హైదరాబాద్ నగరంలో సాగుతున్న డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలపై నెల రోజులుగా దర్యాప్తు చేస్తున్నామని అకున్ సబర్వాల్ తెలిపారు.అయితే, పది రోజులు నుంచి దీనిపై చర్యలు చేపట్టామని తెలిపారు.
హైదరాబాద్: నగరంలో సాగుతున్న డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలపై నెల రోజులుగా దర్యాప్తు చేస్తున్నామని అబ్కారీ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. అయితే, పది రోజులు నుంచి దీనిపై చర్యలు చేపట్టామని తెలిపారు. జూబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. నగరంలో సుమారు వెయ్యి మందికి పైగా ఈ కేసుతో సంబంధం కలిగి ఉన్నారని తెలిపారు. డ్రగ్స్ వినియోగిస్తున్న విద్యార్థుల పేర్లు గానీ... వారు చదువుతున్న పాఠశాలల పేర్లు గానీ తాము వెల్లడించలేదని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కేసును సునిశితంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
పిల్లలెవరూ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులు డ్రగ్స్కు బానిసలైనట్లు ఉపాధ్యాయులకు తెలియదన్నారు. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు.
అలాగే, విద్యార్థుల్లో వచ్చే మార్పులను ఉపాధ్యాయులు కూడా గమనించాలని సూచించారు. తోటి స్నేహితుల ఒత్తిడి, ఇంట్లో ఒంటరితనం వల్ల కొందరు పక్కదారి పట్టే అవకాశం ఉందని అకున్ సబర్వాల్ తెలిపారు.
కాగా, 29కాలేజీలు, పదుల సంఖ్యలో స్కూళ్లు, 2 మహిళా కాలేజీలకు కూడా ఎక్సైజ్ శాఖ లేఖలను పంపింది. డ్రగ్స్ వినియోగిస్తున్న పిల్లలను గమనించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువ మొత్తంలో డబ్బులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, స్మార్ట్ ఫోన్లు ఇవ్వకూడదని సూచించారు.
డ్రగ్స్ కేసులో మరొకరు అరెస్ట్
ఇది ఇలా ఉండగా, డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులు బుధవారం మరొకరిని అరెస్ట్ చేశారు. హోటల్ మేనేజ్మెంట్ సంస్థ నడుపుతున్న బెండెన్ బెన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిఖిల్ శెట్టి, కెల్విన్, బెండెన్లు కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశామని.. 27 కళాశాలలు, 26 పాఠశాలలు, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులకు నోటీసులు జారీ చేసినట్లు అకున్ సబర్వాల్ తెలిపారు. జులై 14న 83 పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
మంత్రి కడియం ఆందోళన
డ్రగ్ మాఫియా విద్యార్థులను టార్టెట్ చేయడం దుర్గార్గమని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో స్కూల్ యాజమాన్యాలు విఫలమయ్యాయని ఆరోపించారు. డ్రగ్ మాఫియా వ్యవహారంలో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలను అప్రమత్తం చేస్తామని కడియం తెలిపారు. ప్రభుత్వ పరంగా డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.