ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె .. సర్కార్ తీరుపై ఆవేదన, ఆందోళనలో కార్మికుల మరణాలు
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇప్పుడు డోలాయమాన స్థితికి చేరుకుంది. సీఎం కేసీఆర్ తాజాగా మరోమారు డెడ్ లైన్ పెట్టటంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళనలో ఉన్నారు. తిరిగి విధుల్లో చేరాలా వద్దా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. ఇది ఇలా ఉంటె బాగా టెన్షన్లో ఉన్న కార్మికులు గుండె పోటుతో ఆస్పత్రుల పాలవుతూనే ఉన్నారు. ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ పరిస్థితులు కార్మిక లోకాన్ని మరింత ఆవేదనకు గురి చేస్తున్నాయి.
కేసీఆర్ డెడ్ లైన్ ఎపెక్ట్: కార్మికుల అభిప్రాయం మేరకే..: ఆర్టీసీ యూనియన్ల కీలక భేటీ..!
మరో ఆర్టీసీ కార్మికుడి మృతి ..
ఒక పక్క ప్రభుత్వ తీరు మారకపోవటం, మరోపక్క ఆర్టీసీ కార్మిక కుటుంబాల్లో ఆర్ధిక ఇబ్బందులు, ఇంకొక వైపు ఆర్టీసీ కార్మికుల మరణాలు ఆర్టీసీ కార్మిక లోకాన్ని బాగా టెన్షన్ పెడుతున్నాయి. సమ్మె ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు . సమ్మెకు మాత్రం సరైన పరిష్కారం దొరకడంలేదు. ఈ సమ్మె ప్రభావం తో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు విద్యార్థులు తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. అలాగే సమ్మె పై ప్రభుత్వం వ్యవహరించే తీరుతో ఇప్పటికే పలువురు ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోగా ,తాజాగా మరో గుండె ఆగిపోయింది.
గుండెపోటుతో దేవరకొండ బస్ డిపో డ్రైవర్ జైపాల్ రెడ్డి మరణం
దేవరకొండ బస్ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న తుమ్మలపల్లి జైపాల్ రెడ్డి నిన్న అర్దరాత్రి గుండెపోటుకు గురయ్యారు. గుండె పోటుతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి స్వస్థలం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పగిడిపల్లి అని సమాచారం . గత నెల 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. అప్పటి నుండి కార్మికుల ఆందోళనలో జైపాల్ రెడ్డి సైతం పాల్గొంటున్నారు. ఆయన మరో ఆరు నెలల్లో రిటైర్ కావాల్సి ఉంది.
ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచిన జైపాల్ రెడ్డి
నవంబర్ 03వ తేదీ ఆదివారం కూడా ఆయన తోటి కార్మికులతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటికి వచ్చిన అనంతరం ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు.వెంటనే కుటుంబసభ్యులు తోటి ఆర్టీసీ కార్మికులకు సమాచారం అందించగా ఆస్పత్రికి తీసుకెళ్ళారు . కండీషన్ సీరియస్ గా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. కానీ మార్గమధ్యంలోనే జైపాల్ రెడ్డి తుదిశ్వాస విడిచాడు. దీంతో కార్మిక లోకం ఆవేదన చెందుతుంది.
జైపాల్ రెడ్డి మృతితో సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత
జైపాల్ రెడ్డి మృతికి ప్రభుత్వం ఆర్టీసీ యజమాన్యం బాధ్యత వహించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. జైపాల్ రెడ్డి మృతికి నిరసనగా దేవరకొండ ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు వివిధ పార్టీల నేతలు ధర్నా నిర్వహించారు.జైపాల్ రెడ్డి మృతితో సూర్యాపేట డిపో వద్ద కూడా ఉద్రికత్త చోటుచేసుకుంది.ఇక జైపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన డిపో మేనేజర్ ను కార్మికులు అడ్డుకున్నారు. సమ్మె పట్ల సర్కార్ తీరుకు తీవ్ర మనస్థాపం చెందారని అందుకే గుండె పోటు వచ్చిందని సహచర కార్మికులు అంటున్నారు. దేవరకొండ బంద్ కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఇలా ఆందోళనతో ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వానికి చలనం లేకుండా పోతుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.