టీకే ఏపీ భవన్, చంద్రబాబు 'సరికొత్త' ప్లాన్?
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం ఏపీ భవన్ ఉమ్మడి భవన్గా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ భవన్ తెలంగాణ రాష్ట్ర ఆధీనంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్కు కొత్తగా భవన్ను నిర్మించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారట.
గత సెప్టెంబర్లో ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు జాతీయ భవనాల నిర్మాణ సంస్థ (ఎన్బీసీసీ) లిమిటెడ్ అధికారులతో ఆయన భేటీ అయ్యారు. కొత్త భవన్ నిర్మాణంపై ప్రణాళికలు తయారు చేసి ఇవ్వాలని కోరారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నవరత్న కంపెనీల్లో ఒకటిగా పేరొందింది. చంద్రబాబు విజ్ఞప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఈ సంస్థ కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి ముసాయిదా ప్రణాళికలు రచించిందని తెలుస్తోంది.
ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థ ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రస్తుతం 19 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇప్పటికీ ఇందులో పది నుంచి 11 ఎకరాలు ఖాళీగానే ఉంది. మిగిలిన స్థలంలోనే ప్రస్తుత నిర్మాణాలు ఉన్నాయి. ఇక, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇందులో ఆంధ్రప్రదేశ్కు 10.6 ఎకరాలు, తెలంగాణకు 8.4 ఎకరాల భూమి చెందుతుంది.
అయితే, ఎవరు దేనిని తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ కూర్చుని మాట్లాడుకోవాల్సి ఉంది. రాష్ట్రం బయటి ఆస్తులను రెండు రాష్ట్రాలూ జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని విభజన చట్టంలో స్పష్టం చేశారని, ప్రస్తుత భవనాన్ని తొలగించి, మొత్తం భూమిని రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 58:42 నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు పంచుకుని వేర్వేరుగా రెండు కొత్త భవన్లను నిర్మించుకునే ప్రతిపాదనకు తాము సిద్ధమేనని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుత భవన్ను తెలంగాణకు ఇచ్చేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆ వర్గాలు వివరించాయి. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కు సరికొత్త భవనాన్ని నిర్మించుకోవడానికి ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ప్రణాళికలు రచిస్తోందంటున్నారు.
రాష్ట్రానికి వచ్చే వాటా భూమిలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ అతిథుల కోసం 100-200 గదులతో కూడిన అతిథి గృహాన్ని నిర్మించటంతోపాటు 2000 సీట్ల సామర్థ్యం కలిగిన భారీ కన్వెన్షన్ సెంటర్, ప్రజల కోసం సర్వీసు అపార్ట్మెంట్లను నిర్మించాలని ఎన్బీసీసీ ముసాయిదా ప్రణాళికలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా ఢిల్లీలో ఉండే వివిధ రాష్ట్రాల భవన్లలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ అతిథులకు మాత్రమే వసతి సదుపాయాలు ఉంటాయి. కానీ, కొత్తగా నిర్మించే ఏపీ భవన్లో సామాన్య ప్రజలు సైతం రుసుము చెల్లించి ఉండేలాగా సర్వీస్ అపార్ట్మెంట్లు నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం.
కొత్త ఏపీ భవన్లో మొత్తం మూడు క్యాంటీన్లు లేదా రెస్టారెంట్లను నిర్వహించాలని ఎన్బీసీసీ ప్రతిపాదిస్తోంది. అయితే, ప్రస్తుతం ఢిల్లీలో బాగా ప్రాచుర్యం పొందిన ఆంధ్రా భోజనంను మాత్రం అలాగే కొనసాగించాలని, ప్రతి ఒక్కరూ వచ్చి తినేలాగా క్యాంటీన్ను అందుబాటులో ఉంచాలని ఎన్బీసీసీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications