తెలంగాణా సర్కార్ డబ్బు దుబారా చేస్తుందన్న ఏపీ బీజేపీ నేత, సీఎం కేసీఆర్ పై విమర్శలు
తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఏపీ బీజేపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల అదనపు కలెక్టర్ లకు కియా కార్నివాల్ కార్లు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే .ఇదే క్రమంలో తాజాగా ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ సర్కార్ పై మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజల డబ్బును దుబారా చేస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ ల కోసం 32 లగ్జరీ కియా కార్నివాల్ కార్లు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఒక్కొక్క కార్ విలువ దాదాపు 30 లక్షల రూపాయలు ఉంటుందని , అటువంటి కార్లను సిఎం ఇంటి ముందు కొలువుదీర్చి హంగామా చేశారన్నారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తుంటే ,ఆ పరిస్థితులను పక్కనపెట్టి తెలంగాణ ప్రభుత్వం డబ్బు దుబారా చేయడంపై విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.కరోనా కష్టకాలంలో ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం కోసం,నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం, రైతుల కష్టాలను తీర్చడం కోసం ఖర్చు చేయకుండా ఇలా కార్లు కొనడానికి ఖర్చు చేయడమేమిటని ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి.

నిన్నటికి నిన్న తెలంగాణ బిజెపి నేతలు కూడా సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చర్య ఓ క్రిమినల్ చర్య అని పేర్కొన్నారు. 32 అల్ట్రా లగ్జరీ వాహనాలు కొనడానికి 11 కోట్లకు పైగా ఖర్చు చేయడం ఎంతవరకు సమర్థనీయం అని తెలంగాణా సీఎం కేసీఆర్ ను బిజెపి పార్టీ ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications