'తెలంగాణ'ను చూస్తే బాధేస్తోంది: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్య
తిరుపతి: మహానాడు వేదిక పైన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం మాట్లాడారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏపీపై విభజన ఎఫెక్ట్, విభజన హామీలు, ఏపీలో ఇబ్బందులు తదితర ఎన్నో అంశాలపై మాట్లాడారు.
చంద్రబాబు చెప్పినట్లు వింటే..
విభజన నేపథ్యంలో ఏపీకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయన్నారు. రాజధానిని కట్టుకోవాల్సిన అవసరముందని చెప్పారు. రాజధాని ఎక్కడ ఉండాలనే చర్చ వచ్చినప్పుడు.. తెలుగు జాతికి అందరికీ అందుబాటులో ఉండేలా, అందరికీ సమాన దూరంలో ఉండేలా రాజధానిని ఎంపిక చేశామన్నారు.
అందుకే విజయవాడ, గుంటూరు మధ్యలో నిర్ణయించామన్నారు. అది అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఇంకా పూర్తిగా రావాల్సి ఉందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విధాలుగా అడ్డుపడినా రైతులు తనను నమ్మి భూములు ఇచ్చారని చెప్పారు.
చంద్రబాబు చెప్పినట్లు వింటే మన జీవితాలు బాగుపడతాయని నమ్మి రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. ఎంతోమంది చెప్పినా మనకు వారు భూములు ఇచ్చారన్నారు. ప్రపంచంలోనే ఇలాంటిది జరగలేదన్నారు.
2022 నాటికి ఏపీ భారత్లోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉండాలని, 2029 నాటికి భారత్లో ఏపీని నెంబర్ వన్ చేస్తామని చెప్పారు. ఏపీలో ఎక్కడైనా కరెంట్ కొరత ఉందా చెప్పాలని కార్యకర్తలను చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ విషయమై తెలంగాణ నేతలు మాట్లాడుతారని చెప్పారు.
మన పరిపాలన వల్ల ప్రజలకు మేలు జరగాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా చేయాలన్నారు. అవినీతి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు ఆనందంగా ఉంటే విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయన్నారు.
ప్రజలు నాకు అధికారం ఇచ్చారని, దానిని ఉపయోగించుకొని నేను బ్రహ్మాండమైన రాష్ట్రంగా చేస్తానని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా... ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పారు. తనకు ఎన్టీఆర్ స్ఫూర్తి అన్నారు. ఏపీలో అయినా, తెలంగాణలో అయినా, ఇంకెక్కడైన తెలుగువారిని ఆదుకునేది టిడిపియే అన్నారు.
రెండు రాష్ట్రాల్లో భిన్న పరిస్థితి
తెలంగాణ, ఏపీలో మనం భిన్న పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఏపీలో అధికారంలో, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నామన్నారు. ఏపీలో పథకాలు పేదవారికి చేరేలా, తెలంగాణలో పేదవారి తరఫున పోరాడాలని చెప్పారు. ఏ గ్రామానికి వెళ్లినా 80 నుంచి 90 శాతం మన వైపే ప్రజలు ఉండేలా చేయాలన్నారు.
ఒడిశాలో ఓ పార్టీ వరుసగా నాలుగోసారి గెలిచిందని, ఐదోసారి గెలిచే అవకాశముందని చెప్పారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో వరుసగా రెండోసారి, గుజరాత్లో వరుసగా నాలుగోసారి గెలిచారన్నారు. అలాగే టీడీపీ కార్యకర్తలు ప్రజలతో మమేకం అయితే గెలుస్తామని చెప్పారు.
ప్రజల కోసం సేవ చేస్తామని ఎవరైనా అంటే మనం సహకరిద్దామని చెప్పారు. కష్టకాలంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేద్దామని చెప్పారు.
తెలంగాణ పైన..
తెలంగాణలో సామాజిక న్యాయం చేసింది టిడిపి అన్నారు. రాజకీయ చైతన్యం తీసుకు వచ్చింది టిడిపి అన్నారు. తెలంగాణలో కరువు ఉందని, ఆ కరువును ఎదుర్కొనేందుకు మన పార్టీ నేతలు, కార్యకర్తలు సమాయత్తం కావాలన్నారు. కరువు నేపథ్యంలో తెలంగాణ టిడిపి నేతలు ప్రజలకు అండగా ఉండాలన్నారు.
ఎక్కడ సమస్యలు ఉంటే, అక్కడ టిడిపి ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ఒకప్పుడు హైదరాబాదును అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ టిడిపి నేతలు ఆ దిశలో ఉద్యమించాలన్నారు.
తెలంగాణ టిడిపికి విజ్ఞప్తి.. వారిని చూస్తే బాధేస్తోంది
విభజన నేపథ్యంలో.. 'తెలంగాణ టిడిపి కార్యకర్తలకు ఓ విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీ ప్రజలు నా పైన నమ్మకం పెట్టుకొని ఓట్లు వేశారు. నాడు సమైక్య ఏపీ కష్టాల్లో ఉండే ప్రపంచ దేశాలు తిరిగి అభివృద్ధి చేశా. ఇప్పుడు ఏపీని కూడా అన్ని విధాలా ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నా'నని చెప్పారు. తద్వారా ఏపీలోనే ఉంటానని అభిప్రాయపడ్డారు. తెలంగాణను అక్కడి నేతలు, కార్యకర్తలు చూసుకోవాలన్నారు..
తెలంగాణలో ప్రజల తరఫున పోరాడాలన్నారు. ఓ విధంగా చూస్తుంటే తెలంగాణ కార్యకర్తలను చూస్తుంటే నాకు బాధ వేస్తోందన్నారు. తెలంగాణలో పన్నెండేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నామన్నారు. ఏపీలో పదేళ్ల తర్వాతైనా అధికారంలోకి వచ్చామని, తెలంగాణలో మాత్రం అదీ లేదన్నారు.
ఇక టిడిపి ఓడిపోవద్దు.. అధికారం మనకు ముఖ్యం
రాజకీయాల్లో మనం చేయాల్సింది.. ఎవరి పరిధిలో వారు బాధ్యతలు నెరవేర్చాలన్నారు. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం స్థాయిలలో నాయకులు తమ తమ బాధ్యతలు నెరవేర్చాలన్నారు. మళ్లీ టిడిపి ఏ స్థాయిలో ఓటమి కావొద్దన్నారు. పంచాయతీ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఓడిపోవద్దన్నారు.
అధికారం చాలా ముఖ్యం అన్నారు. అది మన స్వార్థం కోసం కాదన్నారు. ప్రజాహితం కోసమన్నారు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ల స్వార్థం కోసం అధికారం కావాలన్నారు. చెడు వ్యక్తులు మనకంటే బలవంతులు అయితే సమాజానికి నష్టమన్నారు. కాబట్టి వారిని ఎదగనీయవద్దని అభిప్రాయపడ్డారు.