చంద్రబాబు కొత్త టార్గెట్: పూర్వవైభవం- ఇక్కడా అదే ఫార్ములా
Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. తెలంగాణలో పార్టీ బలోపేతం దృష్టి సారించారు. పూర్వవైభవాన్ని తీసుకొచ్చేలా కసరత్తు మొదలు పెట్టారు. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయంగా టీడీపీని ఆవిర్భవింపజేసేలా అడుగులు వేస్తోన్నారు.
2014లో చోటు చేసుకున్న రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపుగా కనుమరుగైంది టీడీపీ. ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా పోటీ చేయలేని దుస్థితికి దిగజారింది. 2014 ఎన్నికల్లో పోటీ చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. 2018లోనూ అదే పరిస్థితి. 2023 నాటి ఎన్నికలకు పూర్తిగా దూరం కావాల్సి వచ్చింది.

తెలంగాణ విభజన సమయంలో చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతమే దీనికి ప్రధాన కారణం అనే విమర్శలు లేకపోలేదు. ఏపీలో సమైక్య రాగాన్ని అందుకోవడం, తెలంగాణలో విభజన వాదానికి జై కొట్టాల్సి రావడం వంటి డబుల్ గేమ్ను తిప్పి కొట్టారనేది ఆయా ఎన్నికల ఫలితాలతో స్పష్టంగా తేలింది.
తెలంగాణలో క్యాడర్ ఉన్నప్పటికీ.. వారికి సరైన దిశా నిర్దేశం చేయాల్సిన సరైన సారథి ఎవరూ లేకపోవడం కూడా పార్టీ పతనానికి దారి తీసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. 2019 నాటి ఎన్నికల్లో ఏపీలో ఘోరంగా ఓడిపోవడం వల్ల అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు ప్రాధాన్యతను ఇవ్వడమూ ఓ కారణంగా చెబుతున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా 134 సీట్లను సాధించి ఏపీలో విజయఢంకా మోగించిన నేపథ్యంలో ఇక చంద్రబాబు ఫోకస్.. తెలంగాణపై మళ్లింది. ఇక్కడా అదే రేంజ్లో పార్టీని బలోపేతం చేయడంపై కసరత్తు మొదలుపెట్టారు. ప్రతి నెలా రెండు రోజులు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు చంద్రబాబు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ ఆరంభమౌతుంది. పార్టీని వీడి వెళ్లిన వారిని మళ్లీ సొంతగూటికి రప్పించాలనేది ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. దీనితోపాటు కొత్తవారిని రాజకీయాల్లోకి ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications