రెండు రాష్ట్రాలు బాగుండాలని అమ్మవారిని కోరుకున్నా: బాబు, పోస్టర్ల పోటీ
హైదరాబాద్: భాగ్యనగరంలోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఆషాడం బోనాల సందర్భంగా మహంకాళీ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు, నేతలు తరలి వస్తున్నారు.
శనివారం చంద్రబాబుతో పాటు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, మాగంటి గోపినాథ్, సీనియర్ నేత రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
మహంకాళీ అమ్మవారు అంటే తనకు ఎంతో నమ్మకం అని చెప్పారు. ఇరవై ఏళ్లుగా అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు చెప్పారు. ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా, కరువు దరి చేరకుండా ఇరు రాష్ట్రాలు దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.
ఆదివారం నాడు కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్టువస్త్రాలు సమర్పించారు.
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు దత్తాత్రేయ చెప్పారు. అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించేందుకు భక్తులు బారులు తీరారు. కాగా, అమ్మవారి ఆలయం వద్ద పెద్ద ఎత్తున టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, టిడిపి నేతల పోస్టర్లు పోటాపోటీగా వెలువడుతున్నాయి.