రాష్ట్రంలో టీఆర్ఎస్ లీడర్ల కనుసన్నల్లో ఏపీ ముఠా నకిలీ విత్తన దందా: ఏకిపారేసిన విజయశాంతి
తెలంగాణ బిజెపి నాయకురాలు విజయశాంతి తెలంగాణ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో జోరుగా సాగుతున్న నకిలీ విత్తనాల దందాపై విజయశాంతి సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని చెప్పుకునే అధికార టీఆర్ఎస్ నేతలు చేస్తున్న దందా ఇది అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

రైతు ప్రభుత్వం మాటల్లోనే... చేతల్లో అందుకు భిన్నం
కేసీఆర్ సర్కార్ అవినీతి అక్రమాలకు అండగా మారిందని, అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతున్నది అంటూ విరుచుకుపడ్డారు. కెసిఆర్ కు రైతులు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని విజయశాంతి వెల్లడించారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే కేసీఆర్ సర్కార్... చేతల్లో మాత్రం అందుకు విరుద్దంగా ఉందని బిజెపి నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు.

మంచిర్యాల జిల్లాలో రూలింగ్ పార్టీ నాయకులు రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారు
మంచిర్యాల జిల్లాలో రూలింగ్ పార్టీ నాయకులు రైతుల మెడకు ఉరితాడు చుడుతున్నారని ఆమె విమర్శలు గుప్పించారు. కొంతమంది అధికార పార్టీ లీడర్లు, వారి బంధువులు, అనుచరులు నకిలీ విత్తనాల దందాను నడిపిస్తున్నరంటూ విజయశాంతి పేర్కొన్నారు. నకిలీ విత్తనాలతో రైతులను ముంచుతున్నారని, ఇప్పటికే క్వింటాళ్ల కొద్దీ విత్తనాలను గ్రామాలకు తరలించి రైతులకు అంటగట్టారు అని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలో భీమిని, నెన్నెల మండలాల్లో నకిలీ పత్తి విత్తనాల దందా జోరుగా నడుస్తోంది.

ఏపీ నుండి భారీగా నకిలీ విత్తనాలు.. మందమర్రి కేంద్రంగా నకిలీ దందా
సీజన్ ప్రారంభానికి రెండు మూడు నెలల ముందే ఏపీలోని కర్నూలు, నంద్యాల, గుంటూరు ప్రాంతాల నుంచి భారీ మొత్తంలో నకిలీ సీడ్ భీమినికి చేరిందని విజయశాంతి ఆరోపించారు. నెన్నెల మండలంలో కూడా అధికార పార్టీ లీడర్ల కనుసన్నల్లో నకిలీ విత్తన దందా కొనసాగుతోందని ఆమె విమర్శలు గుప్పించారు. ఆంధ్రాకి చెందిన ఓ ముఠా మందమర్రి కేంద్రంగా బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో నకిలీ దందా సాగిస్తోందని విజయశాంతి పేర్కొన్నారు.

టీఆర్ఎస్ పార్టీకి రైతన్నలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం
కౌలు రైతుల ముసుగులో ఇక్కడికి వచ్చిన కొందరు... వ్యవసాయాన్ని వదిలి నకిలీ సీడ్ బిజినెస్లో ఆరితేరారని విజయశాంతి తెలిపారు. ఈ విషయం ఆఫీసర్లకు తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విజయశాంతి ఆరోపించారు.కొద్దిరోజులుగా ఫెర్టిలైజర్స్ షాపుల్లో నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారని, అడపాదడపా కేసులు పెట్టినా.. అధికార పార్టీ లీడర్ల వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదని విజయశాంతి ఈ దందా వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారంటూ మండిపడ్డారు. రైతులను నిండా ముంచుతున్న టీఆర్ఎస్ పార్టీకి ఈ రైతన్నలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం అంటూ విజయశాంతి తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications