కలహం పెట్టిన కాళేశ్వరం..! జగన్ కేసీఆర్ స్నేహానికి గండికొడుతున్న గోదారి..!!
హైదరాబాద్ : స్నేహ పూర్వకంగా ముందుకు వెళ్తున్న తెలంగాణ, ఏపీ సీఎంల మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు చల్లనుంది. వారి మిత్ర బంధానికి తెలంగాణకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టైన కాళేశ్వరం చిచ్చు పెట్టేలా కనిపిస్తోందది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అంత సఖ్యతతో ముందుకు వెళ్ల లేదు. తర్వాత 2019 ఎన్నికల్లో ఏపి లో వైసీపి ప్రభుత్వం అధికారం లోకి రావడం, వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాద్యతలు తీసుకోవడంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అంతే కాకుండా ఉప్పు నిప్పులా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహం చిగురించింది.
కాళేశ్వరంపై ఏపి కొత్త మెలిక.. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించొద్దంటూ సుప్రీంకోర్టు కు లేఖ..
వీరి అనుబంధానికి నిదర్శనంగా తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి పలు సందర్బాల్లో ప్రత్యక్షంగా సంప్రదింపులు జరిపారు. ఏకంగా ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించుకుని ఇరువురు ముఖ్యమంత్రులు ఒకరిని ఒకరు ప్రశంసించుకునన్నారు. విభజన చట్టం ప్రకారం పూర్తి సహకారంతో ముందుకు వెళ్లనున్నట్టు వాగ్ధానం చేసుకున్నారు. అందుకు తగ్గట్టు ఏపీ ఆధీనంలో ఉన్న చాలా వరకు ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది ఏపీ ప్రభుత్వం. ఇంత వరకు కథ సుఖాంతంగా ఉన్నా ఒక అంశంలో మాత్రం వారి స్నేహానికి బీటలు వారే పరిస్ధితిలు తలెత్తాయి. తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిలా ముద్రవేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇద్దరు తెలుగు సీఎం మధ్య శత్రుత్వాన్ని రగిలిస్తోంది.
ప్రాజెక్టు అంశంలో వివాదాలు.. కేసీఆర్, జగన్ మైత్రీ బంధానికి ఎదురు దెబ్బ..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఇదే అంశం పట్ల అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. కానీ, అదే కాళేశ్వరం ప్రాజెక్టు అంశం రెండు రాష్ట్రాల మద్య విభేదాలకు కారణం అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏపి సీఎం జగన్ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు భారీ షాకిచ్చింది. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని, దీనికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించే అంశాన్ని పరిశీలించవద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరడం అంటు తెలంగాణ ప్రజానికాన్ని, ఇటు ఏపీ ప్రజలను విస్మయానికి గురిచేసింది.
కాళ్లేశ్వరం రీడిజైన్ ప్రాజెక్టు కాదు..ముమ్మాటికి కొత్త ప్రాజెక్టే అంటున్న ఏపి..
అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలోని ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపేయడంతో అభ్యంతరాలు చెప్పే హక్కు లేదని స్పష్టం చేసింది. పోలవరానికి సంబంధించిన కేసులో తెలంగాణను కక్ష్యి దారుగా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అఫిడవిట్లోని అంశాలను పరిశీలించి విభజన చట్టంలో పేర్కొన్న హామీలను తప్పకుండా త్వరగా అమలు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విన్నవించింది. విభజన చట్టంలో పేర్కొనని పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు కృష్ణా బోర్డు అనుమతులు లేవని కేంద్ర జలవనరుల శాఖ స్పష్టం చేసినా తెలంగాణ మాత్రం ఈ విషయంలో ముందుకెళ్తోందని ఆరోపించిది ఏపి ప్రభుత్వం.
నీటి వినియోగంలో మాట మార్చుతున్న తెలంగాణ.. మండిపడుతున్న ఏపీ..
ఇదే అంశం పట్ల మరోసారి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం చర్యలు తీసుకోలేదని వివరించింది ఏపి సర్కార్ వివరించింది. కృష్ణా బేసిన్లో 180 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకునేలా పాలమూరు రంగారెడ్డి, డిండి, గోదావరి బేసిన్లో 450 టీఎంసీల నీటి వినియోగం నిమిత్తం కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం తదితర ప్రాజెక్టులను తెలంగాణ చేపట్టిందని ఏపీ ప్రభుత్వం ఘాటుగా విమర్శిస్తోంది. ఇదే అంశాన్ని కోర్టుకు కూడా వివరించింది. రీ ఇంజినీరింగ్ పేరుతో కాళేశ్వరం చేపట్టినట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నా ఇది ముమ్మాటికీ నూతన ప్రాజెక్టేనని ఏపి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించొద్దని ఏపీ ప్రభుత్వం కోరింది. ఇదే అంశం పైన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడి చర్చ జరుగుతోంది.