ఎమ్మెల్యేల అనర్హత వేటు: 'నోటీసులిచ్చినా టీ స్పీకర్ తీసుకోరు, ఏమీ చేయలేం'
హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత వేటుకి సంబంధించిన పెండింగ్ పిటిషన్లపై తాజాగా నోటీసులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. తామిచ్చే నోటీసును స్పీకర్ స్వీకరించరన్న విషయం తమకు తెలుసని హైకోర్టు వ్యాఖ్యానించింది.
నోటీసులను తిరస్కరించే హక్కు స్పీకర్కు ఉందని, ఈ నేపథ్యంలో మరోసారి నోటీసులు జారీ చేయలేమని తెలుగు రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ ఎస్వి భట్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పార్టీ ఫిరాయింపుదారులపై వీలైనంత త్వరగా స్పీకర్ పిటిషన్లను విచారించి పరిష్కరించేందుకు వీలుగా నోటీసులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు ప్రత్యేక మెసెంజర్ ద్వారా స్పీకర్కు నోటీసులు ఇచ్చినా స్వీకరించలేదని పిటిషనర్ల తరఫున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో మళ్లీ తాజాగా నోటీసులు ఇవ్వాలని వారు హైకోర్టుని అభ్యర్ధించారు. తాము స్పీకర్కు తాము ఇచ్చే నోటీసును స్పీకర్ స్వీకరించరన్న విషయం తమకు తెలుసని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇలాంటి పరిస్ధితుల్లో తాము చేయగలిగేదేమీ ఉండదన్నారు. ఈ మొత్తం వ్వవహారంపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ స్పందించాలని హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు అడ్వకేట్ జనరల్ తన వాదన వినిపిస్తూ, కోర్టులు జారీ చేసే నోటీసులను స్పీకర్ తీసుకోరని స్పష్టం చేశారు. అనంతరం కేసు విచారణను ఆగస్టు 20కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.