దావోస్ పోటీలో ఏపీ, తెలంగాణ ఎవరు ముందున్నారు?
దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వెళ్లారు. వీరితో పాటు మంత్రుల్ని కూడా తీసుకెళ్లారు. రెండు రోజులుగా దావోస్ లో పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, పెట్టుబడిదారులతో వీరు సమావేశాలు అవుతున్నారు. తమ రాష్ట్రాల్లో ఉన్న అనుకూలతలు వివరిస్తూ రాష్ట్రానికి రావాలని కోరుతున్నారు. అయితే వీరిలో ఎవరు ముందున్నారు ? ఏ రాష్ట్రానికి వచ్చేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారో ఓసారి చూద్దాం..
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులుగా వెళ్లిన ముఖ్యమంత్రులు, మంత్రులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో, పెట్టుబడిదారులతో జరుపుతున్న చర్చల్లో క్రమంగా పురోగతి కనిపిస్తోంది. అయితే ఏపీతో పోలిస్తే తెలంగాణ కు పెట్టుబడుల ప్రవాహం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో భారీ పెట్టుబడి ఒప్పందం చేసుకుంది. ప్రఖ్యాత కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ (CtrlS Datacenters Pvt Ltd) సంస్థ రూ.10వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అత్యాధునిక ఏఐ (AI) డేటాసెంటర్ క్లస్టర్ను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. కంట్రోల్ఎస్ ((CtrlS) తలపెట్టిన అర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ సామర్థ్యం 400 మెగా వాట్లు కాగా, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.

అలాగే ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సీఎల్ టెక్ (HCL Technologies Limited) హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించేందుకు అంగీకరించింది. ఈ మేరకు దావోస్ సదస్సులో తెలంగాణ పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హెచ్సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి.విజయకుమార్తో జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి. హెచ్సీఎల్ కొత్త సెంటర్లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యమిస్తారు. ఆధునిక క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్లు లబిస్తాయి. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సీఎల్ సిటీ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తారు. ఈ క్యాంపస్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి గోల్డ్ సర్టిఫికేషన్ కూడా అందుకుంది. ఈ కొత్త సెంటర్ ఏర్పాటుతో దాదాపు 5 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి.
ఇవాళ తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్లో అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లొ రూ.60,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు. ఇందులో దాదాపు రూ.60000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో హైదరాబాద్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్లను విస్తరించేందుకు ఒప్పందం కుదిరింది.
మరోవైపు ఏపీ తరపున దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ టీమ్ ఉమ్మడిగానూ, వేర్వేరుగానూ పలువురు పెట్టుబడిదారులతో భేటీ అవుతోంది. ఏపీలో ఉన్న అవకాశాలను వారికి వివరిస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఏఐ, డేటా రంగాల్లో సంస్ధలు పెట్టేందుకు రాష్ట్రానికి రావాలని కోరుతోంది. ఏపీలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ కోసం డీపీ వరల్డ్ ను పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు. అలాగే గూగుల్, పెట్రోనాస్, పెప్సికో సంస్ధల అధినేతలతోనూ భేటీ అయ్యారు. అలాగే బిల్ గేట్స్ తోనూ భేటీ అయ్యారు. అయితే ఇందులో ఎక్కడా పెట్టుబడులు పెడతామన్న హామీ మాత్రం వచ్చినట్లు కనిపించలేదు. అటు మంత్రి లోకేష్ కూడా పలు రౌండ్ టేబుల్ భేటీల్లో, వన్ టూ వన్ మీటింగ్స్ లోనూ పాల్గొంటున్నా పెట్టుబడుల ప్రకటనలు రాలేదు. రాబోయే రోజుల్లో ఏవైనా ప్రకటనలు వస్తే వచ్చినట్లే లేకపోతే అంతే.












Click it and Unblock the Notifications