Aramgarh flyover: మనకు మనమే పోటీ.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
గ్రేటర్ హైదరాబాద్ లో రెండవ అతిపెద్ద ఫ్లై ఓవర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆరాంఘర్ నుండి జూ పార్క్ వరకు నిర్మించిన ఈ అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణంతో హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుందని భావిస్తున్నారు.
ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ ను నేడు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ ద్వారా బెంగళూరు హైవే కు ట్రాఫిక్ అంతరాయం తగ్గుతుందని పేర్కొన్నారు. ఆరాంఘర్ ఫ్లైఓవర్ ను స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులతో కలిసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మనకు మనమే పోటీ అని నిరూపించుకున్నాం : సీఎం రేవంత్
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో అతిపెద్ద ఫ్లై ఓవర్ పీవీ ఎక్స్ప్రెస్ వే ను నిర్మించుకున్నామని, మళ్లీ ఇప్పుడు రెండవ అతిపెద్ద ఫ్లై ఓవర్ ను నిర్మించుకొని మనకు మనమే పోటీ అని నిరూపించుకున్నామన్నారు. ఈ ఫ్లై ఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ ముందుకు వెళుతుందని ఆయన తెలిపారు.
రాజకీయాలు చేసేది అప్పుడే
హైదరాబాద్ నగర అభివృద్ధికి మెట్రో విస్తరణ, మూసి పునరుజ్జీవం వంటి ప్రాజెక్టులు చేపట్టవలసిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తాము హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితోనైనా కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎంఐఎం ను కలుపుకొని ముందుకు వెళతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తాము రాజకీయాలు చేసేది ఎన్నికల సమయంలో మాత్రమేనని నగర అభివృద్ధిలో అందరితో కలిసి ముందుకు వెళ్తామన్నారు.
అది పూర్తయితే తెలంగాణా పురోగతిలో దూకుడు
ఇక తెలంగాణ రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే అభివృద్ధిలో తెలంగాణ మరింత ముందుకు దూసుకు వెళుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఓల్డ్ సిటీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ.. ఒరిజినల్ హైదరాబాద్ అంటూ వ్యాఖ్యానించారు. మీర్ ఆలం ట్యాంక్ పై కేబుల్ బ్రిడ్జి నిర్మించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అభివృద్ధికి సిద్ధంగా ఉన్నాం
త్వరలోనే గోషామహల్ ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పనులు పూర్తి చేసే బాధ్యత ఇక్కడ ప్రజాప్రతినిధులు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.












Click it and Unblock the Notifications