కులాల ఆధిపత్యం: భయంతో రేవంత్'రెడ్డి'ని వదిలి బాబుని టార్గెట్?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు అనంతరం ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆచితూచి స్పందిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు ఉందని రేవంత్ గతంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టయ్యారు. దీనిపై రేవంత్ సామాజిక వర్గానికి చెందిన ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు ఆచితూచి స్పందిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
రేవంత్ను విమర్శిస్తే తామే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోందని అంటున్నారు. అందుకే చాలామంది నేతలు రేవంత్ వ్యవహారం పైన ఆయన పైన ఆచితూచి మాట్లాడుతూనే, అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారని అంటున్నారు.
రేవంత్ రెడ్డి దొరికిన దొంగ అని, తెరాస కూడా ఎప్పటికైనా దొరుకుతుందని విపక్షాలు విమర్శించాయి. రాజకీయాల్లో ఇది జరుగుతుందని సామాన్యునికి కూడా తెలుసునని చెబుతున్నారు.
అయితే, రేవంత్ దొరికిన దొంగ మాత్రమేనని, అలాంటప్పుడు ఆయనను విమర్శిస్తే తాము ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందనే అభిప్రాయం ఆయన సామాజిక వర్గానికి చెందిన వారిలో పలువురిలో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్ను టార్గెట్ చేసుకోవడం వెనుక పార్టీతో పాటు కులాధిపత్యం కూడా ఉందనే వాదనలు చాలారోజులుగా వినిపిస్తున్నాయి.