మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్నారా.. ట్రాఫిక్ లో చిక్కుకోకుండా పోలీసుల సూచనలు తెలుసుకోండి
ఆసియాలోనే అతిపెద్ద జాతర ఆయన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతరకు ట్రాఫిక్ నియంత్రణ అతి పెద్ద సమస్య, ఈసారి ఆ సమస్య లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవార్ల దర్శనం ట్రాఫిక్ నియంత్రణ పైనే ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పేర్కొన్న ఆయన ఆరువేల మంది పోలీసులతో జాతర బందోబస్తు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రమాద రహిత జాతర నిర్వహణే పోలీసుల లక్ష్యం అని తరుణ్ జోషి పేర్కొన్నారు.
గత జాతర మాదిరిగానే వన్ వే ఏర్పాటు
గత జాతర మాదిరిగానే వన్ వే ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. జాతీయ రహదారి వెంట 4కిలోమీటర్లకు ఒక అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పస్రా, మేడారం మధ్య అర కిలో మీటర్ కు ఒక అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినట్టు అందుబాటులో టోయింగ్ వాహనాలు కూడా అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవార్ల దర్శనం చేసుకుని తిరిగి వారి గమ్యస్థానాలకు వెళ్లేలా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందని వరంగల్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పేర్కొన్నారు.
మేడారం జాతర ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి
ఫిబ్రవరి 16 నుండి 19వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ జోన్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు ముఖ్యమైన లక్ష్యాలతో పోలీసులు మేడారం జాతర బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఇందులో ఒకటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవార్ల దర్శించుకోవడంతో పాటు, క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవడం లక్ష్యంగా జాతరను పూర్తిగా విజయవంతం చేయాలని పని చేస్తున్నామని చెప్పారు.
వరంగల్ నుండి తరలివచ్చే ప్రైవేటు వాహనాలు గుడేప్పాడు, ములుగు, పస్రా, నార్లపూర్ చేరుకోని పోలీసులు సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సి వుంటుందని ఆయన సూచించారు.
రూట్ ల వారీగా ట్రాఫిక్ నిబంధనలు
వరంగల్ నుండి బయలుదేరివేళ్ళే ఆర్టీసీ బస్సులు గుడెప్పాడు, మల్లంపల్లి, ములుగు, పస్రా, తాడ్వాయి మీదుగా మేడారంకు చేరుకుంటాయని ఇదే మార్గం ద్వారాఆర్టీసీ బస్సులు కూడా వరంగల్ కు చేరుకుంటాయని చత్తీస్ ఘడ్ నుండి వచ్చే ప్రైవేటు వాహనాలు ఎటూరునాగరం, చిన్నబోయినపల్లి, కొండాయి, ఉరట్టం వద్ద పార్కింగ్ చేసుకోవాల్సి వుంటుందని ఆయన అన్నారు.
తిరుగు ప్రయాణంలోని ఇదే మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. అదేవిధంగా కరీంనగర్, కాళేశ్వరం ఆపై ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు కాటారం, పెగడపల్లి, కాల్వపల్లి, ఊరట్టంలో పార్కింగ్ చేసుకోవాలని, ఈ తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దుదేకులపల్లి మీదుగా కరీంనగర్ చేరుకోవాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారికి పోలీసుల సూచనలు
తిరుగు ప్రయాణంలో గత జాతరలో అవలంభించిన వన్ వే ను ఈసారి కూడా అమలు చేయడం జరుగుతుందని భక్తులు ఇది గమనించాలని సూచించారు. మేడారం నుండి తిరిగి వరంగల్ ఆపై ప్రాంతాలకు తిరిగి వెళ్ళే వాహనాలు తిరుగు ప్రయాణంలో ప్రైవేటు వాహనాలు నార్లపూర్ క్రాస్, బయ్యక్కపేట, గొల్లబుద్దారం, దుదేకులపల్లి, కమాలాపూర్ క్రాస్, భూపాలపల్లి, పర్కాల, అంబాల, అంబాల క్రాస్, కిట్స్ కాలేజ్, వరంగల్ బైపాస్, కరుణాపురం, పెండ్యాల మీదుగా వాహనాలు తిరిగి పోవాల్సి ఉంటుందని అన్నారు.
20 సెక్టార్లుగా ట్రాఫిక్ జోన్ విభజన.. 320 సి.సి కెమెరాల ఏర్పాటు
ట్రాఫిక్ జోన్ మొత్తం 20 సెక్టార్లుగా విభజించడం జరిగిందని ముగ్గురు డి.సి.పిలు ఇంచార్జులుగా వుంటారని, ప్రతి సెక్టార్ కు ఒక అదనపు ఎస్సీ లేదా డి.ఎస్పీలు ఇంచార్జ్ గా వుంటారని వెల్లడించారు. 30 ద్విచక్రవాహన టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ టీం మూడు షిఫ్ట్ లలో విధులు నిర్వహిస్తారని, ట్రాఫిక్ పర్యవేక్షణకై గట్టమ్మ గుట్ట నుండి పస్రా వరకు మొత్తం 320 సి.సి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ వెల్లడించారు.
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం
ప్రధానంగా పస్రా, మేడారం మధ్య ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తరుణ్ జోషి వివరించారు. పస్రా మేడారం మధ్య అర కిలో మీటర్ కు ఒక పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. ముఖ్యంగా జాతరకు వాహనాలపై తరలివచ్చే భక్తులు మధ్యం సేవించి నడపవద్దని, అదే విధంగా ఒకదాని వెనుక ఒకటి వాహనాన్ని నడపాలని, రోడ్లపై వాహనాలను నిలపొద్దని పోలీస్ కమిషనర్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. జాతర నిర్వహణ సందర్భంగా భక్తులు పోలీసు శాఖకు పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు.