వందలో 10మంది జవాన్లే: దేశరక్షణలో మాన్సింగ్తండా గిరిజనులు
సైన్యంలో పని చేయడం అంటేనే భయపడే ఈ రోజుల్లో సైన్యంలో విధులు నిర్వహిస్తూ భారతమాతకు సేవలు అందిస్తున్నారు మాన్సింగ్తండా యువకులు.
జయశంకర్ భూపాలపల్లి: సైన్యంలో పని చేయడం అంటేనే భయపడే ఈ రోజుల్లో సైన్యంలో విధులు నిర్వహిస్తూ భారతమాతకు సేవలు అందిస్తున్నారు మాన్సింగ్తండా యువకులు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ గిరిజన తండాలో కనీస సౌకర్యాలు కరువైనా కష్టపడి చదువుతూ దేశ రక్షణలో భాగస్వాములవుతున్నారు. కొందరు సైనికులుగా, మరికొందరు వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. మరికొందరు సైన్యంలో శిక్షణ పొందుతున్నారు.
జనగామ జిల్లాలో మారుమూల ప్రాంతమైన తరిగొప్పుల మండలం అంకుషాపురం, బొత్తలపర్రె శివారు మాన్సింగ్తండాలో మొత్తం 96 కుటుంబాలు నివాసముంటున్నాయి. మొత్తం జనాభా 416 మంది ఉండగా అందులో 296 మంది గిరిజనులు ఉన్నారు. సుమారు 100 మంది యువకులు గ్రామంలో ఉండగా వీరిలో కొందరు ఈ ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోగా మరికొందరు వ్యవసాయం చేస్తున్నారు.
పది మంది యువకులు మాత్రం దేశ రక్షణ సైన్యంలో చేరారు. ఓ మారుమూల తండా నుంచి దేశ సేవ కోసం పది మంది యువకులు దేశంలోని వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తూ అందరి అభినందనలు అందుకుంటున్నారు.
తండా నుంచి సైన్యంలోకి...
మాన్సింగ్తండా నుంచి దేశ రక్షణ కోసం యువకులు ఒకరిని చూసి ఒకరు బార్డర్ బాటప్టారు. అందులో లకావత్ సంతప్. కత్తుల శ్రీకాంత్, కాయిత సంజీవరాజు, కాయిత జనార్దన్, లకావత్ మోహన్, లకావత్ రాజు, కత్తుల సాంబరాజు, లకావత్ లక్ష్మా, లకావత్ సురేష్, లకావత్ చందులాల్ వివిధ రాష్ట్రాల్లో సైనికులుగా, వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. మరో 15 మంది సైన్యంలో శిక్షణ పొందుతుండగా వారిని ఆదర్శంగా తీసుకొని మరో 10 మంది సైన్యంలోకి చేరడానికి కసరత్తు చేస్తున్నారు.
అంతా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే..
సైనికులుగా పనిచేస్తున్న మాన్సింగ్తండాకు చెందిన పది మంది యువకులు తండాలోని సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించారు. మాన్సింగ్తండాకు 1986లో ప్రభుత్వ పాఠశాల మంజూరైంది. అప్పటి నుంచే ఆ తండాలో చదువులు ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఆ ఊరిలో బడీ లేదు. చదువులూ లేవు.
ఉపాధ్యాయులు సైతం తండా ప్రజలకు చదువు విలువను తెలిపి విద్యపై ఆసక్తిని పెంచారు. వారికి అవగాహన కల్పించారు. సైన్యంలో చేరేందుకు వారిని ప్రోత్సహించారు. అలా ఒకరితర్వాత ఒకరు ఇపుడు పాతిక మంది వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది సైనికులుగా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఏకంగా ఇపుడు ఆ తండాకు 'జవాన్సింగ్తండా' అని పేరు పెడదామని ప్రతిపాదనలు చేస్తున్నారు.