ప్రసాదమూర్తి, నాగేశ్వర్ రావుకు అరుణ్సాగర్ విశిష్ట పురస్కారాలు
హైదరాబాద్: సాహితీరంగంలో, పాత్రికరంగంలో విశేష సేవలందించిన వారికి ఏటా అందించే అరుణ్సాగర్ విశిష్ట పురస్కారాలను జనవరి 2న ప్రదానం చేయనున్నట్లు అరుణ్ సాగర్ ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. విశిష్ట సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి ప్రసాదమూర్తికి, విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని ప్రముఖ జర్నలిస్టు, ఈనాడు(ఆంధ్రప్రదేశ్) ఎడిటర్ ఎం నాగేశ్వరరావుకు అందించనున్నట్లు పేర్కొంది.
తెలంగాణ మీడియా అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే సభలో ప్రముఖ పాత్రికేయులు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్.. అరుణ్సాగర్ స్మారకోపన్యాసం చేస్తారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, సమాచార హక్కు కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే సీహెచ్ క్రాంతికిరణ్, విశిష్ట అతిథులుగా సరస్వతీ సమ్మాన్ పురస్కార గ్రహీత కే శివారెడ్డి, టీఎస్ పీఎస్సీ పూర్వ అధ్యక్షులు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు పాల్గొంటారని ట్రస్ట్ వెల్లడించింది.