అందరి దృష్టి వీరిపైనే: 'లీడర్'ను దెబ్బతీస్తారా, నందమూరి సుహాసిని, బీజేపీ షెహజాదీ ప్రత్యేకం!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. అందరూ మంగళవారం నాటి ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, కీలక నేతల భవిష్యత్తు ఏమిటి అనే చర్చ సాగుతోంది. ఎగ్జిట్ పోల్ సరళి మహాకూటమి, టీఆర్ఎస్ మధ్య పోటాపోటీ కనిపిస్తోంది. బీజేపీ, మజ్లిస్, స్వతంత్రులు కీలకంగా మారే అవకాశాలు కొట్టి పారేయలేని పరిస్థితిలు ఉన్నాయి.
జాతీయ సర్వేలు చాలా వరకు టీఆర్ఎస్ కాస్త కష్టంగా గట్టెక్కుతుందని చెబుతుండగా, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పారు. ఏ పార్టీ గెలుస్తుందనే చర్చతో ఆయా కీలక నియోజకవర్గాలలో ఎవరు గెలుస్తారు, ఎన్ని ఓట్లతో గెలుస్తారు అనే ఉత్కంఠ అందరిలోను నెలకొని ఉంది.
ఎగ్జిట్ పోల్ సర్వేలను విశ్లేషిస్తే తెరాసకు ఇబ్బందులు తప్పవా?: ఈ రెండు సర్వేలు ఏం చేప్పాయంటే?
అతి కీలక నియోజకవర్గాలు
గజ్వెల్లో కేసీఆర్ (టీఆర్ఎస్) వర్సెస్ వంటేరు ప్రతాప్ రెడ్డి (కాంగ్రెస్), కొడంగల్లో రేవంత్ రెడ్డి (కాంగ్రెస్) వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్ఎస్), కూకట్పల్లిలో నందమూరి సుహాసిని (టీడీపీ) వర్సెస్ మాధవరం కృష్ణారావు (టీఆర్ఎస్), సిద్దిపేటలో హరీష్ రావు (టీఆర్ఎస్) వర్సెస్ భవానీ రెడ్డి (టీజేఎస్), నరోత్తమ్ రెడ్డి (బీజేపీ), సిరిసిల్ల కేటీఆర్ (టీఆర్ఎస్) వర్సెస్ కేకే మహేందర్ రెడ్డి (కాంగ్రెస్), హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) వర్సెస్ సైది రెడ్డి (టీఆర్ఎస్), నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (కాంగ్రెస్) వర్సెస్ భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్)ల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. ఆయా చోట్లలో బీజేపీ నుంచి ఆకుల విజయ - గజ్వెల్, నర్సా గౌడ్ - సిరిసిల్ల, నరోత్తమ్ రెడ్డి - సిద్దిపేట, నామాజీ - కొడంగల్, భాగ్య రెడ్డి - హుజూర్ నగర్, షన్ముఖ - నల్గొండలో బరిలో ఉన్నారు. వీరూ ప్రభావం చూపనున్నారు. ఈ నియోజకవర్గాలతో పాటు జానారెడ్డి, కొండా సురేఖ, పొన్నాల లక్ష్మయ్య, అక్బరుద్దీన్ ఓవైసీలు పోటీ చేస్తున్న తదితర నియోజకవర్గాలు కూడా చాలా కీలకమే. అందరి దృష్టి ప్రధానంగా దాదాపు పది స్థానాలపై ఉంది.
గజ్వెల్లో కేసీఆర్ వర్సెస్ వంటేరు
గజ్వెల్ నియోజకవర్గంలో 2014లో కేసీఆర్ పైన టీడీపీ తరఫున వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేసి కేవలం 17వేల పై చిలుకు ఓట్లతో ఓడిపోయారు. ఇప్పుడు వంటేరు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. పైగా ఆయనకు స్థానికంగా మంచి పేరు ఉంది. ఈ సారి టీడీపీ, కాంగ్రెస్ బలానికి తన మంచి పేరుతో కచ్చితంగా గెలుస్తానని వంటేరు ధీమాగా ఉన్నారు. కేసీఆర్ ఇక్కడ పెద్దగా ప్రచారం చేయనప్పటికీ హరీష్ రావు దాదాపు యాభై రోజుల వరకు ఇక్కడే ఉండి తన మామ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసారు. దీంతోనే వంటేరుపై ఓడిపోతాననే భయం కేసీఆర్లో కనిపించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ గట్టెక్కినా స్వల్ప మెజార్టీతో గట్టెక్కుతారని, అది ఆయనకు పెద్ద దెబ్బే అని అంటున్నారు. అలా కాకుండా కేసీఆర్ భారీ మెజార్టీతో గెలిస్తే వంటేరుకు రాజకీయంగా నూకలు చెల్లినట్లే అంటున్నారు.
కొడంగల్లో రేవంత్ రెడ్డి వర్సెస్ పట్నం
కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇక్కడ రేవంత్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఇటీవల కేటీఆర్ ప్రచారం సమయంలో సవాల్ విసిరారు. దీనిని ఆదివారం రేవంత్ రెడ్డి స్వీకరించారు. రేవంత్ పైన తెరాస అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు ముగ్గురు మంత్రులు రంగంలోకి దిగారు. హరీష్ రావు గజ్వెల్తో పాటు కొడంగల్ పైన దృష్టి సారించారు. కేటీఆర్ ఇక్కడ ప్రచారంలో పాల్గొని సవాల్ విసిరారు. కేసీఆర్ కూడా ఎన్నికలకు మూడు రోజుల ముందు ఇక్కడ ప్రచారం నిర్వహించారు.
కేటీఆర్కు సవాల్, హరీష్ రావు సులభంగానే
సిరిసిల్ల నుంచి కేటీ రామారావుపై కేకే మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయనకు కూడా నియోజకవర్గంలో మంచి పేరు, సానుభూతి ఉంది. ఇది కేటీఆర్కు క్లిష్టమైనదే అంటున్నారు. మరోవైపు సిద్దిపేటలో హరీష్ రావుకు తిరుగులేదు. గతంలో కంటే భారీ మెజార్టీ ఖాయమని తెరాస నేతలు ధీమాగా ఉన్నారు.
కూకట్పల్లిలో సుహాసిని వర్సెస్ మాధవరం
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో అన్నింటికంటే ఆసక్తిని రేపుతోంది కూకట్పల్లి నియోజకవర్గం. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. 2014లో టీడీపీ నుంచి గెలిచిన మాధవరం కృష్ణారావు ఈసారి తెరాస నుంచి బరిలో నిలబడటం, ఇక్కడ సీమాంధ్రుల ఓట్లు ఎక్కువగా ఉండటం, అన్నింటికి మించి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని టీడీపీ తరఫున బరిలోకి దిగడం ఆసక్తిని రేపుతోంది. సుహాసిని గెలుస్తారా, గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారనే చర్చ సాగుతోంది. సుహాసిని తరఫున చంద్రబాబు, బాలకృష్ణ, పరిటాల సునీత వంటి కీలక నేతలు ప్రచారం నిర్వహించారు.
నల్గొండలో కోమటిరెడ్డి, ఉత్తమ్
కీలక నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నవి ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఎందుకంటే ఈ జిల్లాలోని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ కీలక నేతలు రంగంలో ఉన్నారు. హుజార్ నగర్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, నాగార్జున సాగర్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి తదితరులు బరిలో ఉన్నారు.
చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ వర్సెస్ సయ్యద్ షెహజాదీ
పాతబస్తీ మజ్లిస్ పార్టీకి పెట్టని కోట. కానీ ఈసారి అక్బరుద్దీన్ ఓవైసీకి బీజేపీ అభ్యర్థి సయ్యద్ షెహజాదీ గట్టి పోటీగా నిలబడ్డారు. ఆమె గెలుస్తారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన మెజార్టీ తగ్గిస్తే మాత్రం మజ్లిస్ పార్టీ తల కొట్టేసినట్లేనని అంటున్నారు. ఇక్కడ మజ్లిస్ తరఫున అక్బరుద్దీన్, బీజేపీ తరఫున సయ్యద్ షెహజాదీ, కాంగ్రెస్ తరఫున ఈసా మిస్రీ, తెరాస తరఫున సీతారామ రెడ్డి బరిలో నిలిచారు. ఇక్కడ ప్రధాన పోటీ మజ్లిస్, బీజేపీయే. అక్బరుద్దీన్ గెలిచినా మెజార్టీ తగ్గితే బీజేపీకి అది మంచి ఉపశమనం అని చెప్పవచ్చు. కూకట్పల్లితో పాటు బీజేపీకి ఈ సీటు చాలా ప్రత్యేకం.