బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిలో పీహెచ్.డీ విద్యార్థులు; రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు!!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి పై టిఆర్ఎస్ శ్రేణులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ దాడులను తీవ్రంగా ఖండించిన బీజేపీ, ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది. ఇక తాజాగా ధర్మపురి అరవింద్ ఇంటి పై దాడి ఘటనకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ను నాంపల్లి కోర్టుకు సమర్పించిన బంజారాహిల్స్ పోలీసులు ఇందులో పలు కీలక విషయాలను వెల్లడించారు.
నాంపల్లి కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన బంజారా హిల్స్ పోలీసులు
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత, రాజకీయ వ్యాఖ్యలు టిఆర్ఎస్ శ్రేణులలో ఆగ్రహానికి కారణం అయ్యాయని, ఈ క్రమంలోనే బంజారాహిల్స్ లోని ధర్మపురి అరవింద్ నివాసంపై టిఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. నాంపల్లి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఎంపీ అరవింద్ ఇంటి పై దాడి ఘటనకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులతో పాటు మొత్తం 9మంది టిఆర్ఎస్ కార్యకర్తలకు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని బంజారా హిల్స్ పోలీసులు కోర్టును కోరారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు పీహెచ్ డీ విద్యార్థులు కావటం గమనార్హం.
అరవింద్ ఇంటి ముందు తగినంత పోలీసులు లేకనే దాడి
కవితను అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేసిన కేసులో తెలంగాణా జాగృతి నేత నవీనా చారి, తెలంగాణా జాగృతి కన్వీనర్ రాజీవ్ సాగర్ నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వారిరువురూ పరారీలో ఉన్నారు. కవితపై ఎంపీ అరవింద్ తన ప్రెస్ మీట్ లలో వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ విమర్శలు చేశారని పేర్కొన్న పోలీసులు, ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలతో టిఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటిముందు ఆందోళనకు దిగాలని నిర్ణయించుకున్నారని, అయితే అరవింద్ ఇంటి ముందు తగినంత పోలీసులు లేకపోవడంతో నిందితులు టిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఇంట్లోకి చొరబడి దాడి చేశారని పేర్కొన్నారు. మొదట ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి రాళ్ళు విసిరారని, ఆపై పూల కుండీలు పగలగొట్టారని, కిటికీలు తలుపులు ధ్వంసం చేశారని పేర్కొన్నారు.
నిందితులపై ఈ నేరాల క్రింద కేసులు నమోదు చేశామన్న పోలీసులు
అనంతర ఇంట్లోకి చొరబడి పూజ గదితో సహా అన్ని గదులలో ఉండే వస్తువులు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నిందితులపై అతిక్రమణ, ఆస్తి నష్టం, బెదిరింపు వంటి అభియోగాలు మోపి కేసు నమోదు చేసినట్లు గా పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో 2 సిమెంట్ రాళ్లు, 2 టిఆర్ఎస్ పార్టీ జెండాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇక ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని, మీడియాలో కూడా ప్రసారం చేయబడ్డాయి అని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.