పోసాని ఇంటిపై దాడితో సంబంధం లేదు, పవన్ తర్వాత కేసీఆరే కావొచ్చు: జనసేన
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై జరిగిన దాడికి తమ పార్టీకి సంబంధం లేదని జనసేన పార్టీ స్పష్టం చేసింది. తెలంగాణలో ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని జనసేన రాష్ట్ర ఇంఛార్జ్ శంకర్ వ్యాఖ్యానించారు. పోసాని విమర్శలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోసానిపై ఫిర్యాదు ఇచ్చి మూడు రోజులైనా ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పోసానిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు శంకర్. పోసాని మాటల వెనుక వైసీపీ కుట్ర ఉందని, ఇది తెలంగాణలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతుందని శంకర్ అన్నారు.

పోసాని ఇంటిపై దాడికి జనసేనకూ సంబంధం లేదని శంకర్ స్పస్టం చేశారు. పోసానిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పోసానిపై నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేస్తామని, ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. పోసానికి ప్రభుత్వం ఎందుకు ఇంత రక్షణ కల్పిస్తోందని ప్రశ్నించారు. ఆయనేమీ ఎంపీ, ఎమ్మెల్యే కాదని.. అంతమంది సిబ్బంది ఎందుకు ఇచ్చారని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ను తిట్టిన పోసాని కృష్ణమురళి.. రేపు సీఎం కేసీఆర్ను కూడా తిడతారని శంకర్ చెప్పారు.
తెలంగాణలో ఒక పార్టీ అధ్యక్షడికే రక్షణ లేకపోతే.. భవిష్యత్లో సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, అసదుద్దీన్లకు కూడా ఇదే జరగొచ్చునన్నారు. పోసానిని కంట్రోల్ చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనని శంకర్ గౌడ్ అన్నారు. పవన్ కళ్యాణ్ తెల్లకాగితం లాంటివాడని గతంలోనే పోసాని వ్యాఖ్యానించినట్లు గుర్తు చేశారు.
మరోవైపు డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. బుధవారం రాత్రి పోసాని ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ సమయంలో పోసాని ఆ ఇంట్లో లేరు. ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉంటున్నారు. సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. ఆ ఇంటి వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర కూడా పోసానిపై దాడికి యత్నించారు. పవన్ కళ్యాణ్ అభిమానులుగా గుర్తించాం. ముందస్తుగా అన్నీ చర్యలు తీసుకుంటున్నాం. పంజాగుట్ట ప్రెస్ క్లబ్లో జరిగిన సంఘటనపై ఇప్పటి వరకు పోసాని ఫిర్యాదు చేయలేదు. నిన్న ఎస్ఆర్ నగర్లో జరిగిన సంఘటనపై కూడా ఫిర్యాదు చేయలేదు. రెండు సంఘటనలపై కూడా విచారణ జరుగుతోందని తెలిపారు.
పోసానిపై ఫిర్యాదు
పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీలోని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆయన కుటుంబ సభ్యుల పై పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటూ దీనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పోలీసులను కోరారు.
పవన్ కళ్యాణ్తో సోము వీర్రాజు భేటీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇరు పార్టీల నేతలూ సమావేశమయ్యారు. బద్వేలు ఉపఎన్నిక, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
అక్టోబర్ 2న శ్రమదానం వివరాలను జనసేన నేతలు సోము వీర్రాజుకు వివరించారు. అక్టోబర్ 7న నెల్లూరులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే మత్స్య గర్జన సభ వివరాలను బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్కు తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్, మధుకర్లు కూడా పాల్గొన్నారు.
ఉప ఎన్నికల్లో పొత్తులు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు సోము వీర్రాజు. తాము కచ్చితంగా బద్వేలు ఉప ఎన్నికల బరిలో నిలుస్తామని తేల్చిచెప్పారు. అయితే ఏ పార్టీ నుండి అభ్యర్థి బరిలో నిలుస్తారన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
కాగా, బద్వేలు ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన వెంకటసుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఉపఎన్నికల్లో ఆయన సతీమణి డాక్టర్ దాసరి సుధను వైఎస్సార్సీపీ తమ అభ్యర్థిగా వైసీపీ బరిలో నిలపనుంది. ఇక, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయిన ఓబుళాపురం రాజశేఖర్ను తమ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది.
బద్వేలు(ఎస్సీ రిజర్వుడ్) ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించి.. నవంబరు 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నియోజకవర్గంలో 2,04,618 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,02,811 మంది పురుషులు, 1,01,786 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
Recommended Video
మరోవైపు, సోము వీర్రాజుతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. అక్టోబర్ 2 నేరుగా పవన్ కళ్యాణ్ రాజమండ్రికి చేరుకోనున్నారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ శ్రమదానం చేస్తారని ఇది వరకే ప్రకటించారు. అయితే శ్రమదానం కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో జనసేన కార్యక్రమం నిర్వహణ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ వైసీపీ సర్కారు పట్టించుకోవడం లేదని, దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని పవన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన ఆధ్వర్యంలోనే రోడ్లకు మరమ్మత్తుల కార్యక్రమం చేపట్టారు పవన్ కళ్యాణ్.












Click it and Unblock the Notifications