చదువు చెప్పినందుకు.. ప్రాణాలు తీశాడు: అరెస్ట్
తొందరపాటులో ఘటనాస్థలంలో వదిలివెళ్లిన సెల్ఫోన్ ఆధారంగా 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, కేసు మిస్టరీని ఛేదించారు. శుక్రవారం సాయంత్రం నార్సింగి పీఎస్లో జాయింట్ సీపీ శశిధర్రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
మొయినాబాద్ మండలానికి చెందిన మహ్మద్ ఫహీముద్దీన్ (40) ఆటోడ్రైవర్. మొయినాబాద్లోని మెథడిస్ట్ పాఠశాలలో వృద్ధురాలు సులోచన హిందీ టీచర్గా పని చేసే సమయంలో ఫహీముద్దీన్ ఆమె వద్ద విద్యనభ్యసించాడు. ప్రస్తుతం ఆటో డ్రైవర్గా మారడంతో సులోచన తనకు తెలిసినవాడే కదా అని స్కూలుకు రోజూ అతడి ఆటోలో వెళ్తోంది.
ఫహీముద్దీన్ హైదర్షాకోట్ నుంచి మొయినాబాద్కు ఆటోలో ఆమెను పాఠశాలకు తీసుకువెళ్లి, తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో వారికి నమ్మకస్తుడిగా మారాడు. ఇంట్లో ఇద్దరు వృద్ధులు మాత్రమే ఉండడంతో పెద్ద మొత్తంలో డబ్బులు, నగలు ఉంటాయని దొంగిలించేందుకు పథకం పన్నాడు. గురువారం కార్తీక పౌర్ణమి కావడంతో ఇంట్లోనే ఉంటారని భావించి సాయంత్రం ఆటోతో వారి ఇంటికి చేరుకున్నారు.
సమీపంలో ఆటోపార్క్ చేసి ఇంట్లోకి వెళ్లిన ఆటోడ్రైవర్ ఆమె భర్త సింహాద్రి చేతికి ఉన్న ఉంగరాన్ని లాక్కుకోబోయాడు. ప్రతిఘటించగా తలపై రాడ్తో బాది హతమార్చాడు. ఈలోగా బయటినుంచి వచ్చిన సులోచన బయట చెప్పులు చూసి ఎవరో వచ్చి తన భర్తతో మాట్లాడుతున్నారని భావించి సరాసరి బెడ్రూమ్లోకి వెళ్లింది. ఈ విషయం ఎక్కడ బయటపెడుతుందోనని భావించిన నిందితుడు ఆమె తలను గోడకేసి కొట్టి చంపి పరారయ్యాడు.
ఈ క్రమంలో సెల్ఫోన్ మరిచిపోవడంతో దాని ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. మొయినాబాద్లో ఉన్నాడని తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు అక్కడే పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 4 బంగారు గాజులు, రెండు సెల్ఫోన్లు, ఒక ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన 24 గంటలలోపే జంట హత్యల మిస్టరీని చేధించిన నార్సింగి పోలీసులను జాయింట్ సీపీ శశిధర్రెడ్డి అభినందించారు.
డీసీపీ రమేష్ నాయుడు, రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యం రెడ్డి, ఎస్ఓటీ ఓఎస్డి రాంచంద్రారెడ్డి, ఇన్స్పెక్టర్ రాంచందర్రావు, డీఐ ప్రకాష్, ఎస్ఐ సుధీర్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లు గురు రాఘవేంద్ర, ఉమేందర్, ఎస్ఐ శివకుమార్ పాల్గొన్నారు. ఫహీముద్దీన్ పాత నేరస్తుడేనని పోలీసులు తెలతిపారు. లంగర్హౌజ్ పోలీస్ స్టేషన్లో చైన్స్నాచింగ్కు పాల్పడి అరెస్టయి జైలుకు శిక్ష అనుభవించినట్లు చెప్పారు.