పట్టపగలు నడిరోడ్డుపై కత్తితో పొడిచి ఆటో డ్రైవర్ హత్య.. హన్మకొండలో దారుణం!
వరంగల్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హన్మకొండలో నడిరోడ్డుపై పట్టపగలే ఒక వ్యక్తిని కత్తితో పొడిచి హతమార్చిన ఘటన స్థానికంగా ఉన్న వారిని షాక్ కు గురిచేసింది. అందరూ చూస్తుండగానే ఒక ఆటో డ్రైవర్ ను మరొక ఆటో డ్రైవర్ నడిరోడ్డుపై కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇక ఈ ఘటన వివరాలలోకి వెళితే...
హన్మకొండలో ఆటో డ్రైవర్ దారుణ హత్య
హనుమకొండలోని అదాలత్ జంక్షన్ సమీపంలో ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ సమయంలో ఒక ఆటో డ్రైవర్ మరొక ఆటో డ్రైవర్ పైన కత్తితో దాడికి దిగాడు. వరుసగా ఆగకుండా ఆటో డ్రైవర్ ను కత్తితో పొడిచేసాడు. వరుస కత్తిపోట్లతో గాయపడిన ఆటో డ్రైవర్ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. ఘర్షణకు పాల్పడ్డవారు ఇద్దరు ఆటో డ్రైవర్లు కావడం గమనార్హం.

దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఒక ఆటో డ్రైవర్ ఏనుగు వెంకటేశ్వర్లు చేతిలో మడికొండకు చెందిన మాచర్ల రాజకుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇక ఏనుగు వెంకటేశ్వర్లుకు, మాచర్ల రాజకుమార్ కు మధ్య గొడవకు అసలు కారణాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వివాహేతర సంబంధమే దీనికి కారణం అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఘటన
ఈ ఘటన పైన సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు .మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఈ కేసులో అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా పట్టపగలు నడిరోడ్డు మీద జరిగిన ఈ దారుణ ఘటన ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తుంది.
సినిమా చూసినట్టు చూసిన జనం
శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా, ఇలాంటి ఘటనలు జరగటం ఆందోళన కలిగిస్తుంది. అయితే పట్టపగలు నడి రోడ్డు మీద ఇంత దారుణం జరుగుతున్నా జనం మాత్రం సినిమా చూసినట్టు చూస్తూ ఉండిపోయారే కానీ కనీసం వారి గొడవ ఆపే ప్రయత్నం కానీ, కత్తితో దాడికి వస్తున్న సమయంలో అడ్డుకునే సాహసం కానీ ఎవరూ చేయలేకపోయారు.












Click it and Unblock the Notifications