జూబ్లీహిల్స్ బై పోల్ కాంగ్రెస్ అభ్యర్దిగా - రేవంత్ ఛాయిస్, అక్కడే ట్విస్ట్..!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి తో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే ఈ ఉప ఎన్నిక పైన ముగ్గురు మంత్రులకు రేవంత్ బాధ్యతలు అప్పగించారు. బీజేపీ ప్రత్యర్ది పార్టీల అభ్యర్ధులకు అనుగుణంగా ప్రతి వ్యూహం అమలు చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్ధి ఖరారు పైన రేవంత్ ఒక అంచనా కు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఇక్కడ సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి.
బై పోల్ కోసం
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీ హిల్స్ కు ఉప ఎన్నిక దిశగా కసరత్తు జరుగుతోంది. అక్టోబర్ లో ఈ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు. కంటోన్మెంట్ లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో.. ఇప్పుడు జూబ్లీహిల్స్ లోనూ విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. నియోజకవర్గంలో పరిస్థితులు.. పోటీ.. నిర్ణయం పైన అధ్యయనం కోసం సీఎం రేవంత్ ముగ్గురు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్ లు ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో ఎంఐఎం పోటీ ఇక్కడ కాంగ్రెస్ పైన ప్రభావం చూపనుంది. ముస్లిం ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో ఎంఐఎం నిర్ణయం కీలకంగా మారనుంది.

రేవంత్ ఆలోచన
కాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున తాను బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ చెప్పుకొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినా, గట్టిగా పోరాడి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపో యానని ఆయన గుర్తు చేశారు. తనకు టికెట్ ఇవ్వడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈసారి అందరి సహకారంతో తాను గెలిచి, రాహుల్ గాంధీకి బహుమతిగా అందిస్తా నని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక.. నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు.. ప్రస్తుత పరిస్థితులు.. ఎంఐఎం పోటీ వంటి అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారు.
మారిన లెక్కలు
ఇక, ఇటు బీఆర్ఎస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గోపీనాధ్ కుటుంబ సభ్యులను బరిలో దింపాలని ఆలోచన చేస్తోంది. అందుకు వారు ముందుకు రాకుంటే.. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. బీజేపీ సైతం ఈ సీటు పైన ఆశలు పెంచుకుంటోంది. టీడీపీకి కలిసి వచ్చే సమీకరణా లు ఉండటంతో... ఆ పార్టీ నేతలు సైతం ఈ నియోజకవర్గం లో పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దాని పైన సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్ధిని నిలబడితే టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించనున్నాయి. దీంతో .. ఎన్నికకు సమయం ఉన్నా.. మూడు ప్రధాన పార్టీలు ఇక్కడ అభ్యర్ధుల ఎంపిక పైన సర్వే ల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నాయి.












Click it and Unblock the Notifications