గ్రేటర్లో టీఆర్ఎస్ ప్రభంజనం: కేసీఆర్కు బాలయ్య అభినందనలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి అభినందనలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు శుక్రవారం రాత్రి పలువురు ప్రముఖులు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం ఫలితాల వెల్లడి పూర్తి కాగానే కేసీఆర్ కు ఫోన్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించారని ఆయన కేసీఆర్ను అభినందించారు. మరోవైపు టాలీవుడ్ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా కేసీఆర్కు ఫోన్లో అభినందనలు తెలిపారు.
వీరితో పాటు సూపర్ స్టార్ కృష్ణ, మంచు మోహన్ బాబు కూడా కేసీఆర్కు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎన్నికల ప్రకటన మొదలుకొని అభ్యర్థుల ఎంపికదాకా, సవాళ్లతో ప్రచారంలో సునామీ సృష్టించడం నుంచి ఫలితాల్లో జైత్రయాత్ర సాగించటం దాకా అన్నీ తానై నడిపించిన మంత్రి కేటీఆర్కు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు.
తండ్రికి తగ్గ తనయుడని ప్రశంసిస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం ఈ రెండు మన ముందున్న కర్తవ్యాలు. గ్రేటర్పై గులాబీ జెండా ఎగరాల్సి ఉంది అంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్కు అప్పగించారు.
ఆ బాధ్యతను కేటీఆర్ వందశాతం నెరవేర్చారు. చరిత్రలో ఎవరూ సాధించని విధంగా జీహెచ్ఎంసీలో ఘన విజయాన్ని సాధించి సీఎం కేసీఆర్కు ప్రేమతో బహుమతిగా ఇచ్చారు.