పార్టీ పెట్టుకో!: ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై బాల్క సుమన్ ఫైర్
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ డొంక తిరుగుడు వ్యవహారాలు మానేసి ఓ రాజకీయ పార్టీ పెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ సలహా ఇచ్చారు. మీడియాను, పత్రికను అడ్డుపెట్టుకొని తెలంగాణను, కేసీఆర్ను బద్నాం చేయడమే లక్ష్యంగా ఆయన దుష్ప్రచారాలకు దిగుతున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలోఎమ్మెల్యే పుట్టమధు, మాజీ ఎమ్మెల్సీ భానుప్రసాద్లతో కలిసి ఆయన మాట్లాడారు.
ఓ సెక్షన్ మీడియా రైతుల ఆత్మస్థెర్యం దెబ్బతీసేలా నిత్యం అభూత కల్పనలతో తప్పుడు రాతలు రాస్తున్నదని, తెలంగాణ ఇమేజ్ను డామేజ్ చేయాలని కుట్రలు చేస్తున్నదని సుమన్ మండిపడ్డారు. తెలంగాణను విఫల ప్రయోగంగా చూపాలని పచ్చపత్రికల అధినేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించబోవని అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ఇవే పచ్చ పత్రికలు ఎంత విషం కక్కినా ఎన్ని తప్పుడు వార్తలు రాసినా ప్రతిఘటించి రాష్ర్టాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు.
రైతు ఆత్మహత్యలంటూ రాధాకృష్ణ చేస్తున్న దుష్ప్రచారాలకు గద్వాల పద్మ కథనమే నిదర్శనమన్నారు. గద్వాలలో పెంటాకుల పద్మ అనే రైతు ఆత్మహత్య చేసుకుందని వేమూరి రాధాకృష్ణ రాశారని, నిజానికి ఆమె రజక సామాజికవర్గానికి చెందిన మహిళ అని, ఆమెకు ఎకరం భూమి కూడా లేదని, కల్తీ కల్లు దొరకక చనిపోయిందని ఎఫ్ఐఆర్ నమోదైనట్లు గద్వాల ఆర్డీవో స్వయంగా తనకు చెప్పారని ఆయన వివరించారు.
కానీ ఆమెను రైతు జాబితాలో చేర్చి రైతుల ఆత్మహత్యల సంఖ్యను పెంచుతూ వార్తలు రాశారని సుమన్ చెప్పారు. మేం రాసిందే బైబిల్ , ఖురాన్ , భగవధ్గీత అనుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం నోరు మూసుకుని కూర్చోవాలని ఆ పచ్చ పత్రికలు అనుకుంటే పొరపాటని హెచ్చరించారు.
పక్క రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నా దాచిపెడుతూ ఆ రాష్ట్రాన్ని మీడియా ప్రమోట్ చేస్తున్నదని సుమన్ ఆరోపించారు. ఏపీలో పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, అనంతపురం జిల్లాలో అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నా పచ్చ పత్రికలకు కనిపించవని ఆయన అన్నారు.
తెలంగాణలో మాత్రం ఎవరు చనిపోయినా రైతుల్లాగే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. 60ఏళ్లు పాలించిన దూరదృష్టి లేని దుర్మార్గ రైతు వ్యతిరేకుల పాలన ఫలితమే నేటి ఆత్మహత్యలని సుమన్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుకు పూర్తి అండగా ఉంటుందన్నారు.