భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణానికి సిద్దమా... బండి సంజయ్కి బాల్క సుమన్ సవాల్...
హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉపఎన్నిక తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ ఇప్పటినుంచే గ్రౌండ్ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే క్రమంలో శుక్రవారం(జూన్ 25) ఈటల పేరుతో ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఆ లేఖ ఫేక్ అని బీజేపీ చెబుతోంది. మరోవైపు టీఆర్ఎస్ మాత్రం అది నిజమైన లేఖనే అని వాదిస్తోంది. తాజాగా ప్రభుత్వ విప్,చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ అంశంపై స్పందించారు.
Recommended Video
ఆ లేఖ నిజమే : బాల్క సుమన్
మంత్రి ఈటల రాజేందర్ పేరిట వైరల్ అయిన లేఖ నిజమేనని బాల్క సుమన్ అన్నారు. గతంలో ఈటల రాజేందర్ సీఎంకు ఆ లేఖ రాశారని చెప్పారు. అది ఫేక్ లెటర్ అని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఒకవేళ అది ఫేక్ లెటరే అయితే... హైదరాబాద్ చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రమాణానికి సిద్దమా అని బాల్క సుమన్ బండి సంజయ్కి సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని... ఇకపై ఆయన ఈటల రాజేందర్ కాదు వెన్నుపోటు రాజేందర్ అని విమర్శించారు.
మీరా నాకు నీతులు చెప్పేది : బాల్క సుమన్
ఎన్నికల వేళ బీజేపీ నేతలు డబ్బు సంచులతో రంగంలోకి దిగుతారని గతంలో ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారని బాల్క సుమన్ గుర్తుచేశారు. కేసీఆర్ను అనేందుకు మనసెలా వస్తుంది ఈటల రాజేందరన్నా అంటూ ప్రశ్నించారు. అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర బీజేపీ నేతలదని... అలాంటి నేతలు తనకే నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. తన కుటుంబం 2001 నుంచి టీఆర్ఎస్తోనే ఉందని అన్నారు. హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతులని.. బీజేపీ మొసలి కన్నీళ్లను నమ్మరని... కచ్చితంగా ఆ పార్టీకి బుద్ది చెప్పి తీరుతారని అన్నారు.
తెలంగాణకు బీజేపీ అన్యాయం...
బీజేపీ తెలంగాణ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని బాల్క సుమన్ చెప్పారు. విభజన హామీల్లో కేంద్రం ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.'గిరిజన యూనవర్సిటీ హామీ ఏమైంది,కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏది,బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టట్లేదు,ఐటీఐఆర్ రద్దు చేసి యువతకు ఉద్యోగాలు రాకుండా చేశారు... కాళేశ్వరం,పాలమూరు ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వమని అడిగితే ఎందుకు స్పందించట్లేదు..' అని బాల్క సుమన్ ప్రశ్నించారు. దేశంలో పేదరికం ఎట్లా పెరుగుతోందో... అంబానీ,ఆదానీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
వంట గ్యాస్ ధరలు,పెట్రోల్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నారని... ఆఖరికి కరోనా సంక్షోభ కాలంలో రాష్ట్రానికి తగినన్ని వ్యాక్సిన్లు కూడా కేటాయించలేదని విమర్శించారు. ఈటల రాజేందర్కు కేసీఆర్ అందరి కంటే ఎక్కువ అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు.
అప్పట్లో బండి సంజయ్ ఇదే సవాల్...
ఈటల రాజేందర్ పేరిట వైరల్ అయిన లేఖలో 'తప్పు నాదే... పెద్ద మనసుతో నన్ను క్షమించండి..' అంటూ సీఎం కేసీఆర్ను ఆయన వేడుకున్నట్లుగా ఉంది. అయితే ఇది ఫేక్ లెటర్ అని బీజేపీ అంటోంది. ఇది ఫేక్ కాదు... నిజమేనని బాల్క సుమన్ అంటున్నారు. ఒకవేళ అది ఫేక్ అయితే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణానికి సిద్దమా అని ఆయన సవాల్ విసురుతున్నారు.
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్కు ఇదే సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. వరద సాయం నిలిపేయాలని బండి సంజయ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లుగా అప్పట్లో ఓ లేఖ తెరపైకి వచ్చింది. అయితే అది ఫేక్ లెటర్ అని... టీఆర్ఎస్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసిందని సంజయ్ ఆరోపించారు. అంతేకాదు,దీనిపై భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణానికి రావాలని కేసీఆర్కు సవాల్ విసిరారు. ఇప్పుడిదే తరహా సవాల్ టీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఎదురవుతుండటం గమనార్హం.