'అక్రమాలను నిరూపిస్తా, లేదంటే ముక్కు నేలకు రాస్తా', 'వ్యక్తిగతంగా దూషిస్తే ఊరుకోను'
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మరోసారి ఆరోపణలు చేశారు.విద్యుత్ ఒప్పందాలపై సిబిఐ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
విద్యుత్ విషయంలో రేవంత్ ను కాంగ్రెస్ పార్టీ వాడుకొంటుందని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపణలు గుప్పించారు. వ్యక్తిగతంగా తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడాన్ని బాల్క సుమన్ తీవ్రంగా ఖండించారు.
సుమారు ఐదు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి, టిఆర్ఎస్ నేత బాల్క సుమన్ ల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయమై మాటల యుద్దం సాగుతోంది. ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాల విషయంలో అవకతవలకు పాల్పడిన విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్దంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అయితే విశ్వసనీయత లేని రేవంత్ రెడ్డితో తాము చర్చకు సిద్దంగా లేమని బాల్క సుమన్ ప్రకటించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత జానారెడ్డిలతో చర్చకు తాము సిద్దమని ప్రకటించారు.

సిబిఐ విచారణకు రేవంత్ డిమాండ్
ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండానే విద్యుత్ కాంట్రాక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం బిహెచ్ఈఎల్ కంపెనీకి కట్టబెట్టడం వల్ల సుమారు రూ 5 వేల కోట్లను విద్యుత్ సంస్థలు నష్షపోయాయని కాంగ్రెస్ నేత రేవంత్ రె్డ్డి ఆరోపించారు. ఇతర కంపెనీల మాదిరిగానే బిహెచ్ ఈఎల్ కూడ టెండర్ల ప్రక్రియలో పాల్గొనాల్సిందేనని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యుత్ ఒప్పందాలపై సిబిఐ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ముక్కు నేలకు రాస్తా
విద్యుత్ ఒప్పందాల విషయంలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకొన్నాయని తాను చేస్తున్న ఆరోపణలను నిరూపించేందుకు సిద్దంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒకవేళ తాను ఈ విషయాలను నిరూపించలేకపోతే ఆబిడ్స్ సెంటర్లో ముక్కు నేలకు రాస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు టిఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి తన అనుచరులతో అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నారని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ చెప్పారు. తాను కూడ రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా తిట్టించగలగని సుమన్ రేవంత్ ను హెచ్చరించారు.గన్పార్కు దగ్గర రేవంత్ అబద్ధాలు మాట్లాడారని, విశ్వసనీయత లేని రేవంత్ లాంటి వ్యక్తితో చర్చ అనవసరమని తెలంగాణ సమాజం భావించిందని సుమన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్కు కాంట్రాక్టు ఇస్తే తప్పుబట్టిన.. రేవంత్ లాంటి వ్యక్తి మరొకరు లేరని బాల్క సుమన్ చెప్పారు.

విద్యుత్ విషయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం
వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వడంతో రాజకీయంగా తమ పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకొందని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. దీంతో విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. రేవంత్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన చెప్పారు..












Click it and Unblock the Notifications