'తెలంగాణలో ఆ ముగ్గురి అజెండాకు ప్రయత్నం, తిట్టండి, జైల్లో పెట్టైనా సరే'
అదిలాబాద్: ఎవరు అడ్డం పడ్డా ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగవని, సీఎం కేసీఆర్ ఎప్పుడూ రైతుల కోసమే ఆలోచిస్తారని, ప్రాజెక్టుల రీడిజైన్తో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ఆయన కలలు కంటున్నారని, అనుకున్న పని పూర్తి చేసి తీరుతామని ఎంపీ బాల్క సుమన్ సోమవారం అన్నారు.
కాంగ్రెస్, టిడిపి నాయకులవి చిల్లర రాజకీయాలు అని ధ్వజమెత్తారు. బంగ్లా, గడీల రాజకీయాలు ఇక చెల్లవని అదిలాబాద్ జిల్లాలో హెచ్చరించారు. రైతే రాజులాగ బతికే పరిస్థితులు రావాలని కేసీఆర్ కలలు కంటున్నారన్నారు. అందుకే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైయస్ రాజశేఖర రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల ఎంగిలి మెతుకులకు ఆశ పడి ఆయా పార్టీల్లోని తెలంగాణ నేతలు ప్రజల సంక్షేమాన్ని మరచిపోయారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 35 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులకు రీ డిజైనింగ్ చేశారని, కృష్ణా, గోదావరి నదుల్లో మనకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టునూ వాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం మహారాష్ట్రతో సయోధ్య కుదుర్చుకొని ముందుకు సాగుతున్నామన్నారు.

ఒకరు ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఎజెండా, ఒకరు ఏపీ సీఎం చంద్రబాబు ఎజెండా, మరొకరు కేంద్రమంత్రి వెంకయ్య ఎజెండాను తెలంగాణలో అమలు చేసేందుకు పాటుపడుతున్నారన్నారు. వారి కుట్రలు సాగవన్నారు. తిడితే మమ్మల్ని తిట్టండి కానీ ప్రాజెక్టులకు అడ్డుపడొద్దన్నారు.
డీకే అరుణ పైన కూడా బాల్క సుమన్ మండిపడ్డారు. గద్వాలను జిల్లా చేయాలంటూ డికె అరుణ చేసిన నిరాహార దీక్షకు పక్కనే ఉన్న ఎమ్మెల్యే చిన్నా రెడ్డి ఎందుకు మద్దతు పలుకలేదని ప్రశ్నించారు. మీ పార్టీ నేతలనే ఒప్పించుకోలేని నీకు ముఖ్యమంవూతిని విమర్శించే స్థాయి లేదన్నారు.
ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టి నీళ్లను తీసుకుపోతే తెలంగాణ బిడ్డగా ఏం చేశావని నిలదీశారు. గద్వాల జిల్లా అయితే మీ భూముల విలువ పెరుగుతుందని డ్రామాలాడుతున్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. గద్వాల నీ సంస్థానం అనుకున్నావా, బంగ్లా, గడీల, కాంగ్రెస్ రాజకీయాలు ఇకపై చెల్లవని హెచ్చరించారు.
జైల్లో పెట్టైనా సరే: తలసాని
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కృషి చేస్తున్నారని, అలాంటి ముఖ్యమంత్రిని అనవసరంగా విమర్శిస్తే ప్రజలు ఊరుకోరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం నాడు హెచ్చరించారు.
గద్వాల, జనగాం జిల్లాలు ఏర్పాటు చేయాలని అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ ఎందుకు అడగలేదని ఆయన నిలదీశారు. సెప్టెంబర్ 17 నిర్వహణపై భారతీయ జనతా పార్టీ తమను విమర్శించడం సరికాదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడితే జైలులో పెట్టి పనులు పూర్తి చేస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications