బీజేపీ ఎమ్మెల్యేల చిల్లర ప్రయత్నం; ఈటల ఎక్కువ ఊహించుకున్నాడు: బాల్క సుమన్ చురకలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెట్టే సమయంలో బిజెపి ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి అడ్డుకునే ప్రయత్నం చేయగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అయితే ప్రతిపక్ష పార్టీలను గొంతు నొక్కుతున్నారు అని, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ బిజెపి నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ ముందు బైఠాయించి బిజెపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ లు నిరసన తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై బాల్క సుమన్
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై తాజాగా ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బిజెపి ఎమ్మెల్యేలు ముందే అనుకుని నల్ల కండువాలను వేసుకొని వచ్చి బడ్జెట్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారని, స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్ళే ప్రయత్నం కూడా చేశారని బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారని సుమన్ వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన ఘటనలు బాధాకరమని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వెల్లడించారు .
ఈటల తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నారు
ఈటల రాజేందర్ తనకు తాను ఎక్కువ ఊహించుకుంటున్నారు అంటూ బాల్క సుమన్ ఈటల రాజేందర్ పై మండిపడ్డారు. ఆర్ఆర్ఆర్ అంటూ బిజెపి ఎమ్మెల్యేలు చిల్లర ప్రయత్నాలు చేశారని బాల్క సుమన్ పేర్కొన్నారు. ఈటల రాజేందర్ తమతో ఉంటే ట్రెజరీ బెంచ్లో కూర్చున్నాడని, తమని విడిచాక రోడ్డుపై కూర్చున్నాడు అంటూ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు.
బడ్జెట్ కోసం అన్ని వర్గాల వారు ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో బీజేపీ నేతలు అడ్డగోలు ప్రవర్తనపై బాల్కసుమన్ మండిపడ్డారు. సభా హక్కులను బీజేపీ నేతలు దుర్వినియోగం చేశారని అందుకే వారిని సస్పెండ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.
ప్లాన్ ప్రకారం వచ్చి చిల్లర ప్రయత్నం
ఇదే సమయంలో మంత్రి కిషన్ రెడ్డి ని టార్గెట్ చేసిన బాల్క సుమన్ కిషన్ రెడ్డి అధికార అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే నియోజకవర్గాల పెంపు బిల్లుకు ఆమోదం తెలపాలని సవాల్ విసిరారు. బీజేపీకి గత ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లలో డిపాజిట్లు కూడా రావని బాల్క సుమన్ వెల్లడించారు. బిజెపి ఎమ్మెల్యేలు ప్రణాళికాబద్ధంగా వచ్చి, చిల్లర ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేసే చిల్లర ఎత్తుగడ వేశారని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
దమ్ముంటే నల్ల కండువాలు వేసుకొని ఆ పని చెయ్యాలని బాల్క సుమన్ సవాల్
బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో కొత్త లేదని, అది వింతేం కాదని బాల్క సుమన్ స్పష్టం చేశారు. బిజెపి ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. దమ్ముంటే నల్ల కండువాలు వేసుకొని బిజెపి ఎమ్మెల్యేలు తెలంగాణాకు విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటా కోసం ప్రధాని నరేంద్ర మోడీ ముందు, హోం మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేయాలని సవాల్ విసిరారు బాల్క సుమన్.
దేశంలో గతంలో చట్టసభల్లో నుంచి సభ్యులను సస్పెండ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అని బాల్క సుమన్ వెల్లడించారు. గతంలో రాజ్యసభలో 12 మంది సభ్యలను సస్పెండ్ చేశారని బాల్క సుమన్ గుర్తు చేశారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని, కర్ణాటకలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను వారం పాటు సస్పెండ్ చేశారని బాల్క సుమన్ పేర్కొన్నారు.