కేసీఆర్తో చెప్పించు!: తాము రెడీ అంటూ ముందస్తుపై కేటీఆర్కు బండి సంజయ్ సవాల్
తాము కూడా ముందుస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని.. కేటీఆర్ ఆ మాటను తన తండ్రి కేసీఆర్తో చెప్పించాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.
హైదరాబాద్: తాము కూడా ముందుస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని.. కేటీఆర్ ఆ మాటను తన తండ్రి కేసీఆర్తో చెప్పించాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ సిద్ధమేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చి తెలంగాణ ఇజ్జత్ తీశారని మండిపడ్డారు.
ఇతర రాష్ట్రాల నాయకులను రప్పించి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ అనేక అబద్ధాలు ఆడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ చెబుతున్న అబద్ధాలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్నారు. రైతు బీమా కేసుల్లో 10వేల రైతులవీ ఆత్మహత్యలేనని చెప్పారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటురాని వంద గ్రామాల పేర్లు చెప్తానని.. వచ్చే ఐదు గ్రామాల పేర్లు చెప్పాలన్నారు.
తమ పార్టీలో కోవర్టులు ఉండరని అన్నారు బండి సంజయ్. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి, ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు రైతులను ఎమ్మెల్యేలను చేస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని బండి సంజయ్ ప్రశ్నించారు.
ప్రతి గింజా కేంద్రమే కొంటున్నా.. తానే కొనుగోలు చేస్తున్నట్లు కేసీఆర్ నమ్మిస్తున్నాడని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్నారై పాలసీ తీసుకురాలేదన్నారు. కేసీఆర్ బిడ్డ కవిత మాత్రం దుబాయి వెళ్లి డబ్బులు వసూలు చేసుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. తమపార్టీలో కోవర్టులున్నారని ఈటల రాజేందర్ అనలేదని.. మీడియా వక్రీకరణ చేసిందన్నారు.
కాగా, నిజామాబాద్లో మంత్రి కేటీఆర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలపై వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీ తమ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళదామంటే తెలంగాణలో తాము కూడా ముందస్తుకు వెళతామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన బండి సంజయ్ పైవ్యాఖ్యలు చేశారు.