చేతకాని దద్దమ్మలా ఢిల్లీలో కెసీఆర్; వడ్లు కొనకుంటే రాజీనామా చెయ్: బండి సంజయ్, ఈటల ధ్వజం
తెలంగాణా బీజేపీ నేతలు కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ధాన్యం కొనేది కేంద్రంలోని బీజేపీనే అని తెలంగాణ బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిర్వహించిన బిజెపి దీక్షలో భాగంగా మాట్లాడిన బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో సీఎం కేసీఆర్ వెంటనే గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు.
డబ్బులతో ఓట్లు సీట్లు కొంటున్న కేసీఆర్ రైతుల ధాన్యం కొనలేరా? బండి సంజయ్
కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో ఆర్టీసీ, రిజిస్ట్రేషన్, కరెంట్ ఛార్జీలు పెంచారని, పదవ తేదీ దాటినా తెలంగాణాలో ఉద్యోగులకు ఇంత వరకు జీతాలు రాలేదని, వృద్ధులకు ఇంతవరకు పెన్షన్లు రాలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులపై నుండి ప్రజల దృష్టిని మరల్చటం కోసం కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేపట్టారని ఆరోపించారు. డబ్బులతో ఓట్లు, సీట్లు కొంటున్న కేసీఆర్ రైతులు ధాన్యం కొనుగోలు చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.
మిగతా రాష్ట్రాలకు లేని సమస్య తెలంగాణాలోనే ఎందుకు?
దేశంలో తెలంగాణ కంటే ధాన్యం పండించే రాష్ట్రాలు 7 రాష్ట్రాలు ఉన్నాయని, ధాన్యం కొనుగోలు విషయంలో ఆ రాష్ట్రాలకు రాని సమస్య కేవలం తెలంగాణకు మాత్రమే ఎందుకు వస్తుంది అని బండి సంజయ్ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రెండు మూడు దశాబ్దాలుగా ఇదే విధానం కొనసాగుతుందని పేర్కొన్న ఆయన, గత ఏడేళ్లుగా తెలంగాణా నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోంది కేంద్రమేనని స్పష్టం చేశారు. రాజకీయ స్వార్థం కోసం కేసిఆర్ రైతులను అరిగోస పెడుతున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు.
మిల్లర్లకు లాభం చేకూర్చి వందల కోట్లు వెనకేసుకోవటానికేనా ఈ రగడ?
కేంద్రం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుంటే రాష్ట్రం కేవలం మధ్యవర్తిత్వం వహిస్తుంది అని బండి సంజయ్ పేర్కొన్నారు. మిల్లర్లకు లాభం చేకూర్చడం ద్వారా వందల కోట్లు వెనకేసుకునేందుకు సీఎం కేసీఆర్ ఈ రకమైన సమస్యలు సృష్టిస్తున్నారు అంటూ బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ప్రతి ఏడాది ధాన్యం తామే కొంటున్నామని కేసీఆర్ అబద్ధం చెబుతున్నారు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ధాన్యం కొనాలి లేదంటే కెసీఆర్ గద్దె దిగాలి : ఈటల రాజేందర్
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని, అలా కాని పక్షంలో గద్దె దిగాలని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కెసిఆర్ పరిపాలన వదిలేసి దద్దమ్మ మాదిరి ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పాలని కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు ఉందని ప్రశ్నించిన ఈటల రాజేందర్ కావాలని టిఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
రైతుల పంటను కొనలేని అసమర్ధ ముఖ్యమంత్రి ఎందుకు?
బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్తున్న కెసిఆర్ తీరు పై మండిపడిన ఈటల రాజేందర్ బంగాళాఖాతంలో కలుపుతారో .. కలుస్తారో ముఖ్యమంత్రితో తేల్చుకుంటామని పేర్కొన్నారు. అయిదారు వేల కోట్లతో రైతుల పంటను కొనలేని అసమర్ధ ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నారంటూ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. పీకే రాకతో కేసీఆర్ పతనం ప్రారంభమైందని, తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ ప్లాన్స్ పనిచేయవని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
కెసిఆర్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే : ఈటల రాజేందర్
మహిళా గవర్నర్ పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని ఈటల రాజేందర్ మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత కెసిఆర్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఈటల వ్యాఖ్యానించారు. మంత్రులు, అధికారులు, ప్రజలంటే సీఎం కేసీఆర్ కు లెక్క లేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవం మాత్రమే పని చేస్తుందని పేర్కొన్న ఈటల రాజేందర్ కెసిఆర్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.