టీఆర్ఎస్ టికెట్లు రౌడీలు, గూండాలకే , కేసీఆర్ కబ్జాల పార్టీని తరిమి కొట్టండి : బండి సంజయ్ ధ్వజం
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పై, టిఆర్ఎస్ పార్టీపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కెసిఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. శనివారం గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న బండి సంజయ్ గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో రౌడీలకు గూండాలకు టిఆర్ఎస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తలలు నరికే పార్టీ కావాలా ? గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఈ సమయంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి గ్రేటర్ వరంగల్ లో తలలు ,కాళ్లు, చేతులు నరికేటోళ్ళకు టికెట్లు ఇచ్చారని పేర్కొన్నారు. తలలు నరికే పార్టీ కావాలా ?ఓరుగల్లును అభివృద్ధి చేసే పార్టీ కావాలా? తేల్చుకోవాలని, ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆలోచించుకోవాలని బండి సంజయ్ పేర్కొన్నారు.
పిట్టకధలు చెప్పి కల్లబొల్లి మాటలతో మోసం చేసే వారికి బుద్ధి చెప్పాలని పిలుపు
కేంద్ర ప్రభుత్వం జీరో అకౌంట్ లో పైసలు ఇస్తున్నారని, కేసీఆర్ కుటుంబం మాత్రం అక్రమంగా దోచుకున్న డబ్బు తో విదేశాల్లో వ్యాపారం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. 2023 లో తప్పకుండా అధికారంలోకి వస్తామని చెప్పిన బండి సంజయ్, వరంగల్ నగరంలో టిఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఫైర్ అయ్యారు. పిట్టకధలు చెప్పి కల్లబొల్లి మాటలతో మోసం చేసే , కబ్జాలకు పాల్పడే పార్టీలను తరిమి కొట్టాలని బండి సంజయ్ పేర్కొన్నారు . ఏయ్ అంటే ఒరేయ్ అనాల్సిన సమయం వచ్చిందని , టీఆర్ ఎస్ రౌడీ పాలనకు చరమ గీతం పాడాలని పేర్కొన్నారు .
అవకాశం ఇస్తే రక్షిత త్రాగు నీరిస్తాం .. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం : బండి సంజయ్
రాంపూర్ డంప్ యార్డ్ నుండి చెత్తాచెదారం వచ్చి వడ్డేపల్లి చెరువు లో చేరుతుందని పేర్కొన్న బండి సంజయ్, ఆ నీటినే తాగునీటికి సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి అవకాశం ఇస్తే మంచినీటి సరఫరా అయ్యేలా చూస్తామని, వరంగల్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ ల కోసం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. బండి సంజయ్ రోడ్ షో ఈ రోజు వరంగల్ లో మడికొండలో ప్రారంభమై, పోచమ్మ మైదాన్ చౌరస్తా వరకు కొనసాగుతుంది.
సీఎం కేసీఆర్ పై టీఆర్ఎస్ పార్టీ పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
కోవిడ్ నియమాలను అనుసరిస్తూ బండి సంజయ్ బైక్ ర్యాలీ కొనసాగుతుంది. గ్రేటర్ వరంగల్ లో కాషాయ జెండా ఎగర వేయడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున బీజేపీ నేతలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నేరుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగి గ్రేటర్ వరంగల్ లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై , టిఆర్ఎస్ పార్టీపై, ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఇంటింటికీ ప్రచారం నిర్వహించటం అటు రాజకీయ పార్టీలకు , ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందికి కలిగిస్తుంది .