తగ్గేదే లే.!ఇక పట్టణంలో కాస్కో.!త్వరలో మల్కాజిగిరి నుండి బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామం.!
హైదరాబాద్ : తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ తగ్గేదే లే అంటున్నారు.. తెలంగాణ జిల్లాల్లో మూడు విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రలు దిగ్విజయంగా ముగించని బండి సంజయ్ అధికార టీఆర్ఎస్ పార్టీకి కాస్కో అనే సవాళ్లు విసిరారు. తాజాగా నాలుగో విడత ప్రజా సంగ్రామ పాద యాత్రను పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజి గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో అటు అధికార టీఆర్ఎస్ పార్టీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలన్నది బండి సంజయ్ వ్యూహంగా తెలుస్తోంది.

నాలుగో విడత ప్రజా సంగ్రమం.. వ్యూహ రచన చేస్తున్న బీజేపి
సెప్టెంబర్ 12వ తేదీ నుండి ప్రారంభించనున్న నాలుగోవిడత పాదయాత్ర మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో నిర్వహించాలనే యోచనలో బిజెపి తెలంగాణ శాఖ ఉన్నట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశ్యం ఉందటున్నాయి బీజేపి శ్రేణులు. హైదరాబాద్ నగరంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు అందుబాటులో ఉంటూ ప్రతిష్టాత్మకమైన మునుగోడు ఉప ఎన్నికను కూడా పర్యవేక్షించడానికి వీలవుతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు.

రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలి.. వినూత్న వ్యూహంలో బీజేపి
బీజేపి తెలంగాణ శాఖ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాలుగో విడత పాదయాత్ర రూట్ మ్యాప్, ఎక్కడ ప్రారంభించాలి? ఎక్కడ ముగించాలి అనే అంశాలపై సెప్టెంబర్ 2,3 తేదీల్లో జిహెచ్ఎంసి, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో ఒకసమావేశాన్ని నిర్వహించి తుదినిర్ణయం తీసుకోనున్నారు రాష్ట్ర బీజేపి ముఖ్య నేతలు. నాలుగో విడత పాదయాత్రను కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గాజులరామారం లో వున్న చిత్తారమ్మ అమ్మవారి ఆలయం లేదా సూరారంలోని కట్టమైసమ్మ అమ్మవారి గుడి వద్ద ప్రారంభిస్తే బాగుంటుందని ఇప్పటికే నాయకులు సూచిస్తున్నారు.

మల్కాజిగిరి నుండి మొదలు.. కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకే నంటున్న బీజేపీ నేతలు
నాలుగోవిడత పాదయాత్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రారంభించి వ్యూహాత్మకంగా అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ వద్ద ముగించాలనే యోచనలో ఉన్నారు బీజేపి అద్యక్ష్యులు బండి సంజయ్. దీనికి కారణం దీని ప్రభావం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పాదయాత్ర ముగించే ప్రాంతానికి 10-15 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి ఆ దిశగా వ్యూహ రచన చేస్తోంది బీజేపి. నాలుగోవిడత పాదయాత్ర పూర్తిగా పట్టణ ప్రాంతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతుందని, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మేడ్చెల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్బి నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు నిర్ణయించాయి.

వచ్చే నెల 12నుంచి పాదయాత్ర.. రూట్ మ్యాప్ పై బీజేపి కసరత్తు
ప్రతి నియోజకవర్గంలో రోజున్నర పాటు యాత్ర కొనసాగించాలని, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సాయంత్రం ఒక పెద్ద సభను నిర్వహించాలని తలపెట్టారు. ప్రతీ రోజు 12 నుండి 16 కిలోమీటర్లు యాత్ర కొనసాగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోనాలుగో విడత పాదయాత్ర నిర్వహించడంలో దాగివున్న వ్యూహం జిహెచ్ఎంసి పరిధిలో బిజెపి పార్టీ పటిష్టవంతంగా వుండటంతో పాటు టిపిసిసి అధ్యక్షులు రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో పాగా వేయాలని, కాంగ్రెస్పార్టీని పూర్తిగా బలహీన పరచాలనే ఉద్దేశంతో ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగోవిడత పాదయాత్రలో గోరేటి వెంకన్న పాట 'గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది పాటని విస్తృతంగా వాడుకోవాలనే యోచనలో బిజెపి తెలంగాణ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications