దారుస్సలాం నుండి అనుమతి; అందుకే తూతూమంత్రంగా వేడుకలు: బండి సంజయ్, కిషన్ రెడ్డి ఫైర్!!
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో సైతం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం తూతూమంత్రంగా వేడుకలు అందుకే
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు ఈ రోజు పండుగ రోజు అని పేర్కొన్న ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వం తూతూమంత్రంగా వేడుకలు జరుపుతోందంటూ మండిపడ్డారు. ఇన్ని రోజులు ఎందుకు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదని కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నించారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు బలైపోయారు అని పేర్కొన్న ఆయన హైదరాబాద్ లో తొలిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జెండా ఎగరవేశారు అని గుర్తు చేశారు.
అమిత్ షా అభినవ సర్దార్ పటేల్ అని కొనియాడిన కిషన్ రెడ్డి
అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు అని అమిత్ షా అభినవ సర్దార్ పటేల్ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివర్ణించారు. పాతికేళ్లుగా ఈ వేడుకలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రస్తుతం బీజేపీ పోరాటంతో విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని కిషన్ రెడ్డి ప్రకటించారు.
కేంద్రం ప్రకటించాక రాష్ట్రంలో కదలిక : బండి సంజయ్
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇంతకాలం అధికారికంగా నిర్వహించని తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వేడుకలు చేస్తామని ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు బండి సంజయ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసోపేత నిర్ణయం తో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.
స్వాతంత్రం వచ్చిన ఏడాది తర్వాత నిజాం పాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి
స్వాతంత్రం వచ్చిన ఏడాది తర్వాత నిజాం పాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి లభించిందని బండి సంజయ్ గుర్తుచేశారు. నిజాం కాలంలో మహిళలపై జరిగిన అకృత్యాలు అత్యంత ఘోరమైనవని పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలోను సర్దార్ వల్లభాయి పటేల్ ప్రారంభిస్తే సెప్టెంబర్ 17 న విముక్తి లభించిందని బండి సంజయ్ తెలిపారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య లాంటి ఎందరో మహానుభావులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని పేర్కొన్నారు.
దారుస్సలాం అనుమతి వచ్చాక వేడుకలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం: బండి సంజయ్
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోతే కేంద్రం నిర్వహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఎన్నో ఏళ్ల తర్వాత అధికారికంగా ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం అని పేర్కొన్న ఆయన, కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించిన తర్వాత కెసిఆర్ దిగొచ్చారని, అంతవరకు కెసిఆర్ దీనిపై ఎన్నిసార్లు డిమాండ్ చేసిన పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.
దారుస్సలాం నుంచి అనుమతి లభించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని బండి సంజయ్ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించారు.