బండి సంజయ్కు ప్రాణహాని: రక్షణ కల్పించాలని కేంద్రమంత్రి అమిత్ షా కు బీజేపీనేత లేఖ
బండి సంజయ్ పాదయాత్ర తో తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగిస్తున్న నాటినుండి నిత్యం అనేకచోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీజేపీ పాదయాత్ర ని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక దాడులు,అరెస్టులు, కోర్టు కేసులతో బండి సంజయ్ పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ భద్రత పై బిజెపి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రాణహాని పొంచివుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు పార్టీ నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి లేఖ రాశారు. బండి సంజయ్ కు భద్రత పెంచాలని ఈ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ కు ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేసిన బిజెపి నేత గూడూరు నారాయణరెడ్డి బండి సంజయ్ కు సీఆర్పీఎఫ్ సిబ్బందితో రక్షణ కల్పించడంతోపాటు, బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా ఏర్పాటు చేయాలంటూ కేంద్రాన్ని కోరారు.
కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి బండి సంజయ్ పాదయాత్రలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితుల గురించి బిజెపి నేత నారాయణ రెడ్డి తీసుకువెళ్లారు. టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించిన ఆయన జనగామ జిల్లాలోకి ప్రవేశించిన బండి సంజయ్ పై టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారని గుర్తు చేశారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ హైదరాబాదులో గతంలో ఎన్నడూ లేనివిధంగా మతఘర్షణలు కొనసాగుతున్నాయని పేర్కొన్న నారాయణ రెడ్డి టిఆర్ఎస్ పరిపాలనలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడులకు పాల్పడడానికి టిఆర్ఎస్ బరితెగిస్తుందని పేర్కొన్న గూడూరు నారాయణరెడ్డి బండి సంజయ్ కు తక్షణం భద్రత పెంచాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను విజ్ఞప్తి చేశారు.