బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి.. కానీ షరతులు వర్తిస్తాయి!!
తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి పోలీసులు అనుమతి నిరాకరించడంపై, బండి సంజయ్ కోర్టు మెట్లు ఎక్కారు. బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ బిజెపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది.
బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి
భైంసా పట్టణం లో కి వెళ్ళకుండా బండి సంజయ్ తన పాదయాత్రను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఇక బైంసా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహించడానికి కోర్టు అనుమతినిచ్చింది. ఇదే సమయంలో కోర్టు పాదయాత్రలో బండి సంజయ్ ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేసింది. ఇక పాదయాత్ర కు సంబంధించి కీలక సూచనలు చేసిన కోర్టు 500 మంది సభ్యులతో మాత్రమే పాదయాత్రను నిర్వహించాలని ఆదేశించింది. మొత్తం మూడు వేల మందితో సభను జరుపుకోవాలని పేర్కొంది.
కర్రలు, ఆయుధాలు వాడరాదు
మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభను నిర్వహించుకోవడానికి అనుమతిని ఇచ్చింది. అంతేకాదు పాదయాత్రలోనూ, సభలోనూ పాల్గొనే కార్యకర్తలు ఎవరు కర్రలు, ఆయుధాలు వాడకూడదని కోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు బిజెపి సీనియర్ నేతలతో బండి సంజయ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పాదయాత్ర కార్యాచరణపై చర్చించనున్నారు. దీంతో బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరణ వ్యవహారంపై రాష్ట్రంలో కొనసాగుతున్న రచ్చకు తెరపడింది. కానీ చాలా షరతుల మధ్య బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుందా అన్నది కూడా చర్చనీయాంశం అయ్యింది.
హౌస్ మోషన్ పిటిషన్ విచారణ.. కీలక ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు
నిర్మల్ జిల్లా బైంసా లో బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటి నుండి మొదలు కావాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో బండి సంజయ్ కు షాక్ తగిలినట్టైంది. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికి తాను పాదయాత్ర చేసి తీరుతానని బండి సంజయ్ బైంసా కు బయల్దేరిన క్రమంలో పోలీసులు ఆయనను అరెస్టు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ శ్రేణులు నిరసనలు నిర్వహించారు. ఇక ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటామని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బిజెపికి కోర్టు జరిపిన విచారణతో షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఇక హైకోర్టు తాజా అనుమతితో బండి సంజయ్ తన పాదయాత్రను తిరిగి కొనసాగించనున్నారు.