బండి సంజయ్ పాదయాత్ర నిరాకరణ టెన్షన్: ఓర్వలేకే ఈ దిక్కుమాలిన చర్యలన్న డీకే అరుణ!!
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. నేటి నుండి ఐదవ విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించడానికి రెడీ అయ్యారు. అయితే ఊహించని విధంగా బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు బ్రేక్ వేశారు. బీజేపీకి షాక్ ఇచ్చారు.
బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరణ.. బండి అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా భైంసా నుండి పాదయాత్రను ప్రారంభించాలని బిజెపి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే, చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా తాము అనుమతి ఇవ్వడం లేదని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వెల్లడించారు. దీంతో బైంసా లో నిర్వహించే సభకు ఖచ్చితంగా వెళ్లి తీరుతామని, అవసరమైతే న్యాయస్థానం తలుపులు తడతామని తేల్చి చెప్పిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ కాన్వాయ్ ను వెంబడించి మరీ పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు.
బండి సంజయ్ అరెస్ట్ పై భగ్గుమన్న బీజేపీ శ్రేణులు.. పలు ప్రాంతాల్లో ఆందోళన
బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పట్టణాలలో రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. అంతేకాదు అనుమతి నిరాకరించిన నిర్మల్ ఎస్ పి ఆఫీస్ ను బిజెపి కార్యకర్తలు ముట్టడించారు. ఇక ఎక్కడికక్కడ బిజెపి కార్యకర్తల ఆందోళనలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
కరీంనగర్లోనూ హై టెన్షన్... టైర్లు కాల్చి బీజేపీ నిరసన
ఇటు బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో కరీంనగర్ లో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ శ్రేణులు రోడ్లపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం నిర్మల్ కు వెళుతున్న బండి సంజయ్ ను అడ్డుకోవడం దారుణమని, ప్రభుత్వ పిరికిపంద చర్య అని మండిపడుతున్నారు. అసలు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే భయం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా అని తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
రాష్ట్రంలో బీజేపీ బలోపేతం.. ఓర్వలేకే ఈ దిక్కుమాలిన చర్యలు: డీకే అరుణ
బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రను అడ్డుకోవడం టిఆర్ఎస్ పిరికిపంద చర్య అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్రంలో బిజెపి బలపడటాన్ని ఓర్చుకోలేక ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు దిగుతున్నారని డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ పాదయాత్ర చేస్తే భయమెందుకు అని ప్రశ్నించిన ఆమె టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే పాదయాత్రను అడ్డుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే సీఎం కెసిఆర్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని డీకే అరుణ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications