టీఆర్ఎస్ దౌర్జన్యాలు ఎక్కువ రోజులు సాగవ్.!ఖమ్మంలో సాయి గణేష్ కుటుంబానికి బండి సంజయ్ పరామర్శ.!
ఖమ్మం/హైదరాబాద్: మహా సంగ్రామ పాద యాత్ర ముగిసిన మరునాడే బండి సంజయ్ ప్రజా క్షేత్రంలోకి వెళ్లారు. 31రోజులు సుధీర్గ పాదయాత్ర సందర్బంగా నేడు బండి సంజయ్ విశ్రాంతి తీసుకుంటారని అందరూ భావించారు. కానీ అందని అంచనాలను తారుమారు చేస్తూ, పాదయాత్ర ద్వారా కలిగిన అలసటను లెక్కచేయకుండా బండి సంజయ్ ఖమ్మంలో కార్యక్రమానికి సన్నాహాలు చేసుకున్నారు. కార్యకర్తల సంక్షేమమే తన లక్ష్యమని బండి సంజయ్ చెప్పకనే చెప్పుకున్నారు. తుక్కుగూడ బహిరంగ సభలో కూడా పార్టీ కార్యకర్తల గురించి భావోద్వేగానికి గురైన బండి అధికారంలోకి వస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని స్పష్టం చేసారు. కార్యకర్తలకోసం ఏం చేయడానికైనా సిద్దమని బండి సంజయ్ పేర్కొన్నారు.
అందులో భాగంగానే ఖమ్మంలో అకాల మరణానికి గురైన బీజేపి కార్యకర్త సాయి గణేష్ చిత్రపటానికి బండి సంజయ్ పూల మాల వేసి నివాళులర్పించారు. సంజయ్ వెంట పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి మోహనరావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా ఉన్నారు. సాయి గణేష్ ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ బోరున విలపించింది గణేష్ అమ్మమ్మ సావిత్రమ్మ. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పోలీసుల వేధింపులకు తన మనవడు బలయ్యారని సావిత్రమ్మ కంట తడి పెట్టుకున్నారు. సాయి గణేష్ కు బీజేపీ అంటే ప్రాణమని, పార్టీ కోసం నిరంతరం కష్టపడే వారిని వివరించారు. సాయి గణేష్ పై 16 కేసులు పెట్టారని, రౌడీషీట్ పెట్టారని వాపోయారు సావిత్రమ్మ. మంత్రి, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని సావిత్రమ్మ వాపోయారు. సావిత్రి శర్మ కుటుంబాన్ని బండి సంజయ్ ఓదార్చారు. సావిత్రమ్మకు ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను బండి సంజయ్ అందజేసి ధైర్యం చెప్పారు.