bandi sanjay: మూడోవిడత ప్రజాసంగ్రామ యాత్ర యాదాద్రి నుండి షురూ.. యాదగిరిపల్లిలో సభకు కేంద్రమంత్రులు
బిజెపి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి, టిఆర్ఎస్ పార్టీపై సమర శంఖం పూరించడానికి ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుండి ఇరవై నాలుగు రోజులపాటు సాగుతుంది. ఆగస్టు 2వ తేదీన ప్రారంభించి ఆగస్టు 26వ తేదీ వరకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని, తదనుగుణంగా మేనిఫెస్టో రూపకల్పన చేయడానికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం టిఆర్ఎస్ పై పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన బీజేపీ పట్ల ప్రజా విశ్వాసం చూరగొనే విధంగా యాత్రను కొనసాగించడానికి సన్నాహాలను పూర్తి చేశారు.

నేటి నుండి బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర.. హాజరుకానున్న కేంద్ర మంత్రులు
నేడు యాదగిరిగుట్ట మండలం యాదగిరి పల్లిలో జరిగే ప్రారంభ సభకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులతో కలిసి ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత, 11 గంటలకు యాదగిరిపల్లి సభా ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కేంద్రమంత్రి షెకావత్ పార్టీ జెండా ఊపడంతో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది.

తొలిరోజు షెడ్యూల్ ఇదే .. 10.5 కిలోమీటర్ల పాదయాత్ర
ఇక తొలిరోజు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 10.5 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. యాదగిరి పల్లి, గాంధీనగర్ యాదగిరిగుట్ట ప్రధాన రహదారి మీదుగా గణేష్ నగర్ నుంచి శుభం గార్డెన్ కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి, ఆ తర్వాత పాతగుట్ట, గొల్ల గుడిసెలు మీదుగా దాతారుపల్లికి చేరుకొని అక్కడ జెండా ఆవిష్కరిస్తారు. ప్రజలతో మాట్లాడతారు. అక్కడి నుండి బస్వాపూర్ చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు బండి సంజయ్ .

వరంగల్ పై ఫోకస్ పెట్టిన కమలం .. ముగింపుకు భారీ బహిరంగ సభ
ఈ పాదయాత్ర ఇరవై నాలుగు రోజుల పాటు సాగి ఆగస్టు 26 వ తేదీన భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవడంతో ముగుస్తుంది. అయితే ఆగస్టు 2 నుండి సాగనున్న బండి సంజయ్ మూడవ విడత పాదయాత్రలో ఈసారి వరంగల్ పై బీజేపీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఈసారి పాదయాత్రను మొదట వరంగల్ నుండి యాదాద్రి వరకు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఆ తర్వాత యాదాద్రి నుండి వరంగల్ కు పాదయాత్రను నిర్వహించాలని నిర్ణయాన్ని మార్చుకుంది. వరంగల్లో పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని, కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభను నిర్వహించాలని బిజెపి ప్లాన్ చేస్తుంది.అందులో భాగంగానే పాదయాత్ర షెడ్యూల్ ను మార్చినట్లుగా తెలుస్తుంది.

12 సెగ్మెంట్లలో బండి సంజయ్ పాదయాత్ర.. ఈసారి చేరికలే టార్గెట్ గా ..
ఇరవై నాలుగు రోజులు 12 సెగ్మెంట్లలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. చివరి రోజు బిజెపి నిర్వహించాలనుకున్న భారీ బహిరంగ సభకు జేపీ నడ్డా హాజరవుతారని సమాచారం. ఈసారి బీజేపీ పాదయాత్ర చేరికలను లక్ష్యంగా చేసుకుని సాగుతుందని తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీజేపీ లో చేరికలకు అనేక మంది టిఆర్ఎస్ పార్టీ నేతలతో చర్చలు జరపారని, వారంతా ఈ పాదయాత్ర చివరి రోజున బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications