కేసీఆర్ ఝూఠా మాటల పోస్టర్లను విడుదలచేసిన బండి సంజయ్; సోషల్ మీడియాలో రచ్చ షురూ!!
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను వదిలి పెట్టడం లేదు. కెసిఆర్ చెప్పేవన్నీఝూటా మాటలేనని మండిపడుతున్న బండి సంజయ్ తాజాగా కెసిఆర్ ఝూటా మాటల పోస్టర్లను విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బిజెపి రాష్ట్రశాఖ కేసీఆర్ ఝూఠా మాటలు పోస్టర్లను రూపొందించగా వాటిని నేడు బండి సంజయ్ విడుదల చేశారు. కేసీఆర్ ఝూఠా మాటలు పోస్టర్లను ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్ తదితర సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని బిజెపి శ్రేణులను ఆయన కోరారు.
కేసీఆర్ హామీలను టార్గెట్ చేస్తూ.. ఝూటా మాటల పోస్టర్ లను విడుదల చేసిన బీజేపీ
బండి సంజయ్ విడుదల చేసిన కెసిఆర్ ఝూటా మాటల పోస్టర్లలో అనేక ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావిస్తూ కెసిఆర్ ను టార్గెట్ చేశారు. ఒక దళిత నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, మాట తప్పితే తల నరుక్కుంటా నని, రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడు ముఖ్యమంత్రి గా ఉంటాడని చెప్పిన కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని ఎక్కడ చేశాడో చెప్పాలని పోస్టర్లో వేశారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఎక్కడో చెప్పాలని పోస్టర్ ద్వారా ప్రశ్నించారు.
ఉద్యోగాల విషయంలో హామీ ఏమైంది.. టార్గెట్ చేస్తూ పోస్టర్లు
రైతులు పండించిన చివరి ఆఖరి గింజ వరకు మేమే కొంటామని చెప్పి ఎక్కడ కొంటున్నారో చూపించాలన్నారు. తెలంగాణలోని ప్రతీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఎక్కడ ఇచ్చారో చూపించాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ రూ.3,016 ల నిరుద్యోగభృతి అందిస్తామని చెప్పి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ప్రతీ సంవత్సరం టీఎస్పిఎస్సి ద్వారా ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఏమైంది అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని చేశారా అని ప్రశ్నించారు. నియోజకవర్గానికో పాలిటెక్నిక్ కాలేజీ కట్టిస్తానని కట్టించారా అన్నారు.
నిర్బంధ ఉచిత విద్య ఏమైంది ?
కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్య తప్పకుండా అమలు చేస్తానన్నారు. ఏమైంది అని ప్రశ్నించారు. విద్యార్థులకు సకాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అందిస్తామని.. ఇచ్చారా అని ప్రశ్నించారు. యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు .. ఏమైంది అని నిలదీశారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి తానే వస్తానని చెప్పి, వచ్చారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతీ లంబాడీ తాండాలో, ప్రతీ గోండు గూడెంలో, ఊరికి దూరంగా ఉండే బస్తీల్లో, ప్రతీ ఇంటికి ప్రభుత్వఖర్చుతో నల్లా పెట్టించి, మంచినీళ్ళు తెచ్చి.. ఆ మంచి నీళ్లతోనే మీ పాదాలు కడుగుతా, కడిగినంకనే ఓట్లు అడుగుతా అని చెప్పిన కెసిఆర్ ఆ పని చేశారా అంటూ ప్రశ్నించారు.
తెలంగాణా అమరుల కోసం చేసిందేమిటి?
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కుటుంబానికి ఉద్యోగం తో పాటు 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులకే రాజకీయ అవకాశాలు కల్పిస్తానని కల్పించారా అంటూ ప్రశ్నించారు. ట్యాంక్ బండ్ పై తెలంగాణ అమరుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, చేశారా అంటూ ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రి స్థలంలో నూతన భవనాన్ని కడతామని చెప్పి కట్టారా అంటూ ప్రశ్నించారు. ప్రతీ జిల్లా కేంద్రంలో సూపర్స్పెషాల్టీ హాస్పిటల్ కట్టిస్తానని ఎందుకు కట్టించలేదని నిలదీశారు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి కట్టిస్తానని కట్టించారా అని ప్రశ్నించారు.
తెలంగాణాలో అక్రమ అరెస్టుల మాటేమిటి?
125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తానన్న కేసీఆర్, ఎక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాడో చూపించాలన్నారు. ప్రతి మండలంలో అంబేద్కర్ వికాస కేంద్రం ఏర్పాటు చేస్తామని, ఎక్కడ ఏర్పాటు చేశారో చూపించాలన్నారు. బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఉండవని చెప్పిన కెసిఆర్ ఎక్కడ ఆత్మహత్యలు లేవో చూపించాలన్నారు. హుస్సేన్ సాగర్ నీటి శుద్ధి చేసి మంచినీళ్ళతో నింపుదామని చెప్పి ఏం చేశారని ప్రశ్నించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపిస్తానని ఎందుకు తెరిపించలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఉండవు ... కానీ జరుగుతున్నదేమిటి..? అని ప్రశ్నించారు.